శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (13:01 IST)

థర్డ్ ఫ్రంట్.. కేసీఆర్, చంద్రబాబు, వెంకయ్య.. వీరిలో ప్రధాని ఎవరు?

థర్డ్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. స్వేచ్ఛాధికారమే అజెండాగా థర్డ్ ఫ్రంట్ ఏర్పడాలని కేసీఆర్ భావిస్తున్నారు. భారతదేశాభివృద్ధికి కొత్త సంస్కరణలు తేవాలని ఇందుకు సీనియర్ అధికారు

థర్డ్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. స్వేచ్ఛాధికారమే అజెండాగా థర్డ్ ఫ్రంట్ ఏర్పడాలని కేసీఆర్ భావిస్తున్నారు. భారతదేశాభివృద్ధికి కొత్త సంస్కరణలు తేవాలని ఇందుకు సీనియర్ అధికారులు మార్గనిర్దేశం చేయాలని కేసీఆర్ చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలవుతున్నా.. అనుకున్న పురోగతి సాధించలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నప్పటికీ.. దేశంలో ప్రజల ప్రాథమిక అవసరాలు తీరట్లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాభివృద్ధికి కావాల్సిన ఎజెండాను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. 
 
సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అనేక మైలురాళ్లను అధిగమించిందని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాల్లోని సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకోవాల్సి అవసరం వుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. న్యాయ, పాలన, శాసన వ్యవస్థల్లోనూ మార్పులు అవసరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
మరోవైపు థర్డ్ ఫ్రంట్‌తో కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీకి చుక్కలు కనిపించనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కనబెట్టేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పిన బీజేపీకి కూడా అదే పరిస్థితి ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయని.. దీంతో ప్రజలు థర్డ్ ఫ్రంట్ వైపు మొగ్గుచూపుతారని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన బీజేపిని వ్యతిరేకించే రాష్ట్రాలన్నీ ఏకమై థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిస్తే దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు ఇద్దరు చంద్రులు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన ఏకమైతే.. దేశ రాజకీయాలు తారుమారు అవుతాయని తెలుస్తోంది.
 
ఇంకా తెలుగు ప్రజల ఒత్తిడి మేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన పదవికి రాజీనామా చేస్తే.. థర్డ్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థిగా ఆయనను నిలబెట్టే అవకాశం కూడా వుందని జోరుగా ప్రచారం సాగుతోంది. లేకుంటే ఇద్దరు చంద్రుల్లో ఎవరైనా ప్రధాని అభ్యర్థిగా నిలిచే ఛాన్సుందని కూడా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక రాష్ట్రాలు ఇప్పటికే థర్డ్ ఫ్రంట్‌ అంటూ నోరెత్తిన కేసీఆర్‌ను ప్రధాని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. థర్డ్ ఫ్రంట్‌ భవితవ్యం ఎలా వుంటుందో వేచి చూడాలి. 
 
మరోవైపు విపక్షాలన్నీ ఏకం కావాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా శరద్ పవార్ కూడా ఈ నెల 27, 28 తేదీల్లో విపక్ష పార్టీలతో భేటీ అయ్యేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ భేటీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పాల్గొంటారని తెలుస్తోంది. దీనిని బట్టి థర్డ్ ఫ్రంట్ త్వరలో ఏర్పాటయ్యే సూచనలు చాలామటుకు వున్నాయని రాజకీయ పండితులు నొక్కి చెప్తున్నారు.