శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (17:21 IST)

'జనసేన' పవన్ కళ్యాణ్ టార్గెట్ 2019: ఫలితాల తర్వాత హీరోనా.. జీరోనా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కుటుంబ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కుటుంబ సభ్యులను కూడా తోసిరాజని టీడీపీ - బీజేపీ కూటమికి జై కొట్టారు. అలా టీడీపీ - బీజేపీ కూటమి విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
 
ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. అందుకే బీజేపీకి బైబై చెప్పేసి వామపక్షాలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోవడం కంటే వామపక్షాలతో ముందుకెళ్తేనే లాభం ఉంటుందన్న ఆలోచన పవన్ చేస్తున్నారన్నదే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
ఇటీవల జరిపిన కొన్ని సర్వేల్లో ఏపీలో బీజేపీ మాటతప్పిన ఒక ద్రోహిగా ముద్ర పడిందన్న ఫీలింగ్ పవన్‌లో ఉందంటున్నారు. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా లేకపోగా, ప్రత్యేక ప్యాకేజీకి (పవన్ భాషలో పాచిపోయిన లడ్డూలు)కూ చట్టబద్ధలేకపోవడం పవన్ బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు కారణమైందంటున్నారు. దీంతో వామపక్షాలవైపు పవన్ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. 
 
ఇప్పటికే ఒక సందర్భంలో పవన్ కల్యాణ్, వామపక్ష పార్టీలకు తమ పార్టీ సిద్ధాంతాలకు కొంత భావసారూప్యత ఉందని తెలిపారు. ఈ వార్తలను బలం చేకూరుస్తూ తాజాగా సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు ఏఐటీయుసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు పవన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిపామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, భూసేకరణ కారణంగా తలెత్తిన సమస్యలు, పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై చర్చలు జరిపామని.. ఇది కేవలం స్నేహపూర్వక భేటీ అని పవన్, రామకృష్ణ చెప్తున్నారు. 
 
మరోవైపు... వచ్చే ఎన్నికల్లో పవనిజం పని చేస్తుందా లేదా అన్నది అనేక అంశాలపై ఆధారపడి వుంటుంది. ముఖ్యంగా.. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్రను పోషిస్తారు? ఆయన ఒక్కరే పోటీ చేస్తారా? ఆయన పార్టీ తరపున భారీగా అభ్యర్థులను పోటీకి దించుతారా? పొత్తు లేకుండా ఒంటరిపోరు చేస్తారా? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. అంతేకాకుడా, ఇటీవల నిర్వహించి ఓ సర్వేలో పవన్ బలం కేవలం 3.86 శాతం మందికి మాత్రమే అనుకూలంగా మాత్రమే మద్దతు ఉన్నట్టు వెల్లడించింది. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత హీరోనా? జీరోనా? అనేది తేలిపోతుంది.