పవన్ని రెచ్చగొడితే... జగన్ని పడగొట్టినట్లే.... ఇదీ బాబు స్ట్రాటజీ
విజయవాడ : ఏపీ రాజకీయంలో చంద్రబాబు వేసే ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ప్రతిపక్ష నేతగా జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలంటే... పవన్ కల్యాణ్ని రెచ్చగొడితే చాలు. ఇదీ ఇపుడు ఆయన స్ట్రాటజీ అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మెగాఫుడ్ పార్కు భూముల వివాదం
విజయవాడ : ఏపీ రాజకీయంలో చంద్రబాబు వేసే ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ప్రతిపక్ష నేతగా జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలంటే... పవన్ కల్యాణ్ని రెచ్చగొడితే చాలు. ఇదీ ఇపుడు ఆయన స్ట్రాటజీ అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మెగాఫుడ్ పార్కు భూముల వివాదం దీనికి ఒక ఉదాహరణ. ఫుడ్ పార్క్ బాధితులకు మద్ధతుగా ప్రతిపక్ష నాయకుడు జగన్ నిలిచారు. ప్రభుత్వం మీద బాధితుల పక్షాల ఒత్తిడి తెచ్చారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
హఠాత్తుగా బాధితులు జనసేనాని పవన్ కళ్యాణ్ను ఆశ్రయించారు. పవన్ను కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా భూముల్ని ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్నిపవన్ ప్రశ్నించడం... ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటలు కూడా తిరగక ముందే ప్రభుత్వం స్పందించడం జరిగిపోయాయి. మెగా ఫుడ్ పార్క్ వద్దకు మంత్రులు వెళ్లారు. సమస్య పరిష్కారం కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.
సరిగ్గా ఇలాంటి సీన్ అమరావతి భూముల విషయంలోనూ జరిగింది. భూ సమీకరణ సందర్భంగా కొన్ని గ్రామాల ప్రజలు ప్రభుత్వం మీద తిరగబడ్డారు. వాళ్లకు వామపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అండగా నిలిచింది. ఆనాడు మద్ధతు పలికిన జగన్ మీద టీడీపీ దమ్మెత్తిపోసింది. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని రివర్స్ గేమ్ ఆడింది. అవే గ్రామాల ప్రజలు జనసేనాని వద్దకు వెళ్లారు. గోడును వెళ్లబోసుకున్నారు. స్పందించిన పవన్ అమరావతి ప్రాంతానికి వచ్చారు. భూ సమీరణగానీ, సేకరణగానీ రైతులకు ఇష్టం లేకుండా చేయడం మంచిది కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.
తాజాగా ప్రత్యేకహోదా అంశంలోనూ అలాగే జరిగింది. ఎప్పటి నుంచో అనేక ప్రజా, ప్రతిపక్ష, విపక్ష పార్టీలు ప్రత్యేకహోదా గురించి పోరాడుతున్నాయి. అఖిలపక్షాన్ని వేయమని అందరూ డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందనలేదు. కానీ, పవన్ కళ్యాణ్ తిరుపతి సభ తరువాత హోదా అంశం కదిలింది. కాకినాడ సభ పెట్టేనాటికి హోదా కాస్తా ప్యాకేజికి వెళ్లింది. ఏదైతేనేం, పవన్ కదిలాడు కనుక సమస్య పరిష్కారం అయింది. ఇలాంటి భావన ప్రజల మధ్యకు వెళ్లింది. ఇదే..చంద్రబాబుకు కావాల్సిందంటున్నారు విశ్లేషకులు.
ప్రతిపక్ష నాయకుడిగా కూడా జగన్ పనికి రాడనే భావన కలిగించడం చంద్రబాబు వ్యూహం. అధికార పక్షాన్ని జగన్ నిలువరించలేకపోతున్నాడనే టాక్ రావాలి. జగన్ కంటే పవన్ బెటరనే భావన ప్రజల్లో కలగాలి. ప్రజల ఆలోచనలను జగన్ మీద నుంచి పవన్ మీదకు మళ్లించాలి… ఇదే ప్రస్తుతం చంద్రబాబు ముందున్న రాజకీయ వ్యూహం. ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగిందని తాజా సర్వే చెబుతోంది. దాన్ని భర్తీ చేసేందుకు ఇపుడు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ప్రయోగిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.