శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By venu
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:45 IST)

పవన్ కళ్యాణ్‌ నోరు మూయించే పనిలో మోడీ... "ట్విట్టర్" సింగ్ ఏమంటారో...

గడ్డం పెంచుకుని, పైజామాలు వేసుకుని ఊరూరు తిరిగి ఆవేశమైన ప్రసంగాలు చేసి బీజేపీని, టీడీపీని గెలిపించాను అనుకుంటున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్... ప్రత్యేక హోదా విషయంలో దగాపడినప్పటి నుంచి తిరుగుబాటుదారునిగ

గడ్డం పెంచుకుని, పైజామాలు వేసుకుని ఊరూరు తిరిగి ఆవేశమైన ప్రసంగాలు చేసి బీజేపీని, టీడీపీని గెలిపించాను అనుకుంటున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్... ప్రత్యేక హోదా విషయంలో దగాపడినప్పటి నుంచి తిరుగుబాటుదారునిగా మిగిలిపోయారు. తనదైనశైలిలో ట్విట్టర్‌లో రెచ్చిపోతున్న పవన్‌ను కమలనాథులు దువ్వే ప్రయత్నం చేసినా రకరకాల కారణాల మూలంగా సాధ్యం కాకపోవడంతో మిన్నకుండిపోయారు. కానీ ఇటీవల పవన్ చేసిన కొన్ని ట్వీట్లకు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు ప్రధాని మోడీ.
 
దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు.. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారు.. ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశ చరిత్రను తిరగరాసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ బిజెపి ప్రభుత్వంపై ట్విట్టర్‌లో దుమ్మెత్తిపోస్తున్న పవన్ వ్యాఖ్యలు చెవినపడ్డాయో ఏమో కానీ, మోడీ ఓ గట్టి నిర్ణయం తీసుకోబోతున్నారట. 
 
దక్షిణాది భాషల్లో ఒకదాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని పాఠశాలల్లో తప్పనిసరి చేయనున్నారని సమాచారం. నీతి అయోగ్ సమావేశానంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఈ విషయమై చర్చించారని వినికిడి. దేశ సమగ్రతను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా, భావి తరాల పట్ల అంతరాన్ని తగ్గించేలా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుందని, తదనంతర పరిణామాలు ఎలా ఉండవచ్చని చర్చ సాగినట్లు సమాచారం.
 
గణాంకాల ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో అత్యధికంగా మాట్లాడే భాషగా హిందీ (41 శాతం) ఉంటే దక్షిణాది భాషల్లో తెలుగు (7.19 శాతం), తమిళం (5.91 శాతం), కన్నడ (3.69 శాతం) చివరగా మలయాళం (3.21 శాతం) ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషగా తెలుగుని ఉత్తరాది పాఠశాలల్లో ప్రవేశపెడతారో లేదా ఎప్పట్లానే పదవుల పంపకంలో పోర్ట్‌ఫోలియోల నుండి, ప్రాజెక్టుల వరకు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపడమే అలవాటైన కేంద్రం ఈ విషయంలోనూ అదే ఆనవాయితీని పాటిస్తుందో వేచిచూడాలి.