శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 11 మార్చి 2017 (18:44 IST)

విదేశాల నుంచి వచ్చి మరీ మోదీ హవాకు బ్రేకులు... అందుకే 'డ్రగ్స్' స్టేట్‌లో కెప్టెన్ అమరీందర్, సిద్ధూ...

మాదక ద్రవ్యాలు... డ్రగ్స్ స్టేట్ అంటే పంజాబ్ అనే పేరు పడిపోయింది. ఆ పేరును సార్థకం చేసింది మాత్రం శిరోమణి అకాళీదల్. ఆ పార్టీకి చెందిన నాయకులు విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసి రాష్ట్రాన్ని డ్రగ్స్ స్టేట్ గా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

మాదక ద్రవ్యాలు... డ్రగ్స్ స్టేట్ అంటే పంజాబ్ అనే పేరు పడిపోయింది. ఆ పేరును సార్థకం చేసింది మాత్రం శిరోమణి అకాళీదల్. ఆ పార్టీకి చెందిన నాయకులు విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసి రాష్ట్రాన్ని డ్రగ్స్ స్టేట్ గా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు స్వయంగా రాష్ట్ర మంత్రులు కొందరు ఈ డ్రగ్స్ వ్యాపారం చేసినట్లు విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. ఫలితం... పంజాబ్ రాష్ట్రంలో అకాళీదళ్-భాజపా సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రజలు మట్టికరిపించారు. 
 
డ్రగ్స్ అరికడతాం అంటూ ఎన్నికల వేళ సన్నాయి నొక్కులు నొక్కుతూ భాజపా-అకాలీదళ్ నేతలు ప్రకటించడంపై ప్రజలు మండిపడ్డారు. పదేళ్ల నుంచి చూస్తూనే వున్నాంలే భాజపా-అకాలీదళ్ పాలన. రైతుల సమస్యలు గాలికి వదిలేశారు. సాగునీటి సమస్యలను పట్టించుకోలేదు. హర్యానాలో భాజపా ప్రభుత్వం వుండటంతో పంజాబు రాష్ట్రానికి నీళ్లివ్వకుండా ఎగువ రాష్ట్రం నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నా పరిష్కరించేందుకు ప్రయత్నించలేదు.
 
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జలంధర్‌లో రైతులు బంగాళాదుంపలు రోడ్లపై పారబోసి నిరసనలు తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు ఏ కార్యాలయం చూసినా అవినీతిమయం. ప్రజలను అవినీతితో జలగల్లా పీక్కు తిన్నారు. అధికారులు, నాయకుల అవినీతిని భరించలేక లోక్‌పాల్ నియమించాలని ప్రజలు అడిగితే దాన్ని పట్టించుకున్న నాధుడే లేడు. మంత్రులందరూ అవినీతిలో కూరుకుపోయి వుంటే ఇక అధికారులు ఎవరి మాట వింటారు. మరోవైపు బాదల్ కుటుంబం పూర్తిగా అవినీతిమయమైపోయింది.
 
ఇవన్నీ గమనించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల వేళ జంప్ చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రజలంతా తమకు సహకరించాలంటూ కోరారు. మరోవైపు విదేశాల్లో పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ స్టేట్ అంటూ గేలి చేస్తుంటే, ఆ మాటలను ప్రవాస పంజాబీలు తట్టుకోలేకపోయారు. ఇక లాభం లేదనుకుని విదేశాల నుంచి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలిపారు. ఎన్నికల సమయంలో విదేశాల నుంచి వచ్చి మరీ భాజపా-అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోదీ ఎన్ని తాయిలాలు ప్రకటించినా, ఆయన హవా అక్కడ చెల్లలేదు. ప్రజలు భాజపా-అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం నిర్ణయం ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైంది.