శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Ivr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (16:30 IST)

షీనా బోరా - ఇంద్రాణి ముఖర్జియా... (సీ)రియల్, టోటల్ కేస్ ఫైల్... స్పెషల్ స్టోరీ

ముగ్గురు భర్తలు, ఆ ముగ్గురు భర్తలకు చెందని ఓ కూతురు, కొడుకు... వాళ్లిద్దరూ తన చెల్లెలు, సోదరుడు అని చెప్పుకుంటూ తిరిగినా అసలు నిజం ప్రపంచం ముందు అబద్ధం. ఇంకా ట్విస్ట్... చెల్లిగా మారిన కూతురు, తాజా భర్త కొడుకుతో ప్రేమ, ఎన్నో అబద్ధాలు, పచ్చనోట్ల మధ్య వావివరసలు చెల్లు. ఇన్ని మలుపుల మధ్య ఆఖరికి కన్న కూతురినే హత్య చేసిన వైన. ఇంద్రాణి ముఖార్జియా స్టోరీ గత వారం నుంచి సీరియల్‌లా నడుస్తోంది.
 
షీనా హత్య తర్వాత నేనే టార్గెట్... దొరికితే అయిపోయేవాడినే...
 
షీనా బోరా కంటే తనను చంపాలని తన తల్లి ఇంద్రాణి ముఖర్జియా ప్లాన్ వేసి, తనకు శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చిందని కుమారుడు మిఖాయిల్ బోరా వెల్లడించాడు. అలాగే, షీనా బోరా తన కుమార్తె అని తనకు ఎపుడో ఇంద్రాణి చెప్పిందంటూ మూడో భర్త పీటర్ ముఖర్జియా తాజాగా వెల్లడించారు. షీనా బోరా హత్య కేసు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం తెల్సిందే. ఈ కేసులో తవ్వేకొద్దీ కొత్తకొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
తాజాగా మిఖాయిల్ బోరా పోలీసుల విచారణలో సరికొత్త విషయాలు వెల్లడించారు. షీనాను హత్య చేసిన రోజు మిఖాయిల్ కూడా ముంబైలోనే ఉన్నాడని, ఆరోజే కొడుకును కూడా హత్య చేయాలని ఇంద్రాణి పథకం వేసిందని పోలీసులు తేల్చారు. షీనా పెళ్లి విషయం మాట్లాడేందుకు తనను ముంబైలోని ఇంటికి ఆమె పిలిపించిందని, తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చారని విచారణలో మిఖాయిల్ వెల్లడించాడు. 
 
దాన్ని తాగగానే తల తిరిగినట్టు అనిపించిందని, అదే సమయంలో షీనాను తీసుకువచ్చేందుకు తన తల్లి, సంజీవ్ ఖన్నాలు వెళ్లారని తెలిపాడు. పీటర్ ముఖర్జియా విదేశాల్లో ఉన్న సమయంలో షీనాకు వివాహమంటూ పిలవడం, ఖన్నా ఇంట్లో ఉండటంతో అనుమానం వచ్చి, తాను ఇంటి నుంచి పారిపోయినట్టు వెల్లడించాడు. ఇదే విషయాన్ని వారి డ్రైవర్ రాయ్ కూడా అంగీకరించాడని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

షీనా ఇంద్రాణి కూతురని నాకు ముందే తెలుసు... జీర్ణించుకోలేకపోయా...
 
ఇదిలావుండా, తన సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో పోలీసుల రిమాండ్‌లో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా మూడో భర్త పీటర్ ముఖర్జియా మరో కొత్త విషయాన్ని వెల్లడించారు. షీనా తన సొంత కూతురే అని ఇంద్రాణి తనతో ఎప్పుడో చెప్పిందని సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. అంతకుముందు, తన కుమరుడు రాహుల్ ముఖర్జియా (పీటర్ తొలి భార్య సంతానం)కు షీనాతో సంబంధం ఉందని పీటర్ తెలిపిన సంగతి తెలిసిందే. షీనా తల్లి ఇంద్రాణియే అని రాహుల్ తనతో అన్నాడని... అయితే ఈ విషయాన్ని ఇంద్రాణి కొట్టి పారేసిందని... షీనా తన చెల్లెలు అనే చెప్పిందని ఇంతకు ముందు పీటర్ చెప్పారు.
 
నిజం చెప్పింది... చావు కొని తెచ్చుకుంది...
 
షీనా బోరా హత్యకు ముందు తన మనస్సులోని మాటను తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు తెలిపింది. నీతో సన్నిహితంగా మెలిగే వ్యక్తితో థాయ్‌లాండ్‌లో గడిపాను. అతనితోనే పిల్లల్ని కనాలని అనుకుంటున్నాను అని తల్లి ఇంద్రాణితో షీనా బోరా చెప్పినట్టు సమాచారం. దీన్ని భరించలేని ఇంద్రాణి కుమార్తె అని కూడా చూడకుండా గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు షీనా బోరా హత్య కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. షీనా బోరా చనిపోయే సమయానికి ఆమె గర్భవతి అని తెలిసింది. తల్లి ఇంద్రాణికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి వల్లే షీనా గర్భందాల్చినట్టు విచారణలో వెల్లడైంది. మరోవైపు షీనా బోరాకు ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ ముఖర్జియాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతున్న విషయంతెల్సిందే. రాహుల్ కూడా పీటర్ ముఖర్జియా రెండో భార్య కుమారుడు. దీంతో షీనా బోరాకు వరుసకు సోదరుడు. 
 
అయితే, షీనా బోరా వరుసకు తనకు సోదరి అవుతుందనే విషయం రాహుల్‌కు తెలియదని ఇతని స్నేహితులు చెపుతున్నారు. పైగా, రాహుల్‌తో షీనా ప్రేమలో పడిందనే విషయం తెలుసుకున్న ఇంద్రాణి.. నిజాలు వెలుగులోకి వస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించి అప్పటికే గర్భందాల్చివున్న షీనాను చాకచక్యంగా గొంతునులిమి హత్య చేసినట్టు సమాచారం. అయితే, షీనా బోరాకు గర్భం రాహుల్ ముఖర్జియా ద్వారా వచ్చిందా.. లేక ఇంద్రాణికి అత్యంత సన్నితుడిగా మెలుగుతూ అతనితో థాయ్‌లాండ్‌తో షీనా గడిపేందుకు వచ్చిందా అనేది తెలియాల్సివుంది.

గాడి తప్పింది... డబ్బు, హోదా కోసం బడా బాబులతో పెళ్లిళ్లు
 
ఇంద్రాణి గత చరిత్రను తిరగేస్తే వళ్లు గుగుర్పాటుకు గురిచేసే నిజాలు వెలుగుచూస్తున్నాయి. చీకటి కోణం వెనుక.. డబ్బు మాటున చేసిన అనేక అమానవీయ వైపరీత్యం వెలుగు చూస్తోంది. తనకు ఒకే ఒక్కసారి వివాహమైందని, తన వెంట ఉన్న పిల్లలు తమ్ముడు, చెల్లెలని పీటర్ ముఖర్జియాను నమ్మించి బుట్టలో వేసుకుంది. అలా ఆమె ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు సమాచారం. పైగా ఇంద్రాణి మాయమాటలకు బుట్టలో పడినవారంతా మంచి సౌండ్ పార్టీలే కావడం గమనార్హం. ఇంద్రాణిని కుమార్తే షీనా బోరా హత్య కేసులో అరెస్టు చేసిన తర్వాత అనేక విస్మయకర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పైగా... ఈమె చేతిలో మోసపోయిన వారందరూ ధనికులే కావడం గమనార్హం. దీంతో ఆమెకు పుట్టిన పిల్లలంతా ఎవరికి పుట్టారన్న సందేహం కూడా కలుగుతోంది. 
ఫేస్ బుక్ ఫోటో
 
ఇంద్రాణి అసలు పేరు పారిబోరా. ఆమె ఉపెన్ బోరా కుమార్తె. ఇంద్రాణి తన తల్లిదండ్రులతో కలిసి గౌహతిలోని సుందర్ నగర్‌లో నివాసముండేది. 1988లో ఇంట్లో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. రెండేళ్ళ తర్వాత ఇద్దరు పిల్లలతో ఇంటికి తిరిగివచ్చింది. ఆ ఇద్దరు పిల్లలో షీనా బోరా, మిఖాయిల్ బోరా. అంటే ఇంద్రాణికి 14 యేళ్లకే వివాహం జరుగగా, 16 యేళ్ళకే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఈ ఇద్దరు పిల్లలు సిద్ధార్థ్ దాస్ వల్లే పుట్టారని ఇంద్రాణి చెపుతుండగా, ఆయన మాత్రం తనకు పుట్టలేదని గట్టిగానే వాదిస్తున్నాడు. దీంతో షీనా, మిఖాయిల్‌లు ఎవరికి పుట్టారన్నది తేలాల్సి వుంది. ఈ సిద్ధార్థ్ దాస్ త్రిపురలో ఓ తేయాకు ఎస్టేట్ యజమాని. 
 
ఆ తర్వాత ఇంద్రాణికి వయస్సు 19 యేళ్లు ఉన్నప్పుడు అంటే 1990లో సంజీవ్ ఖన్నాతో పరిచయమేర్పడింది. ఇది మరింత సన్నిహితంగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, సిద్ధార్థ్‌తో పెళ్లయిన విషయం గానీ, తనకు పిల్లలున్నారనే విషయం గానీ ఆమె సంజీవ్‌ ఖన్నాకు చెప్పలేదు. కానీ, సంజీవ్‌తో వివాహానికి ముందే సిద్ధార్థ్‌కు అంటే 1993లో విడాకులు ఇచ్చారు. 
 
సంజీవ్ ఖన్నాతో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత పీటర్ ముఖర్జియాతో పరిచయం ఏర్పడి ఆయనతో సహజీవనం చేసింది. సంజీవ్ ఖన్నాకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ ముఖర్జియాతో సహజీనం చేస్తూ వచ్చింది. వీరందరి కంటే ముందు మరో భర్త కూడా ఉన్నట్టు సమాచారం. ఈయనకే షీనా బోరా, మిఖాయిల్ బోరా పుట్టినట్టు సిద్ధార్థ్ దాస్ మాటలను బట్టితెలుస్తోంది.

తండ్రి కాని తండ్రి... లేత వయసులోనే ఇంద్రాణిపై లైంగిక దాడి...?
 
ఇంద్రాణి ముఖర్జియా జీవితంలో చీకటి కోణాలు మామూలుగా ఉన్నట్లు లేవు. ఆమె జీవితం చిన్నప్పట్నుంచే గతుకలమయంగా సాగినట్లు మెల్లమెల్లగా అర్థమవుతోంది. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఇంద్రాణి ముఖర్జీయా తల్లిదండ్రుల మధ్య రేగిన మనస్పర్థల కారణం ఇంద్రాణి తల్లి భర్తను వదిలేసి, భర్త సోదరుడిని వివాహం చేసుకుందనీ, దాంతో చిన్నప్పుడే ఇంద్రాణి తల్లితోపాటే అక్కడకు వెళ్లిందని తెలుస్తోంది.
 
ఐతే, తన తండ్రి కాని తండ్రి.. ఉపేంద్ర బోరా ఇంద్రాణిపై లైంగిక దాడికి పాల్పడినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ దాడి అనంతరం ఆమె అక్కడి నుంచి కోల్ కతా వెళ్లిపోయింది. అతడి వల్లనే షీనా బోరా కలిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందువల్లనే ఆమె షీనా బర్త్ సర్టిఫికేట్లో ఆమె తల్లిదండ్రుల పేర్లుగా తన తల్లిదండ్రుల పేర్లను ఎక్కించినట్లు అనుమానిస్తున్నారు. ఇంద్రాణిపై లైంగిక దాడి నిజమేనంటూ ఆమె కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారు కూడా చెపుతున్నట్లు తెలుస్తోంది.
 
షీనా పుర్రె, ఎముకలు ఫోరెన్సిక్ ల్యాబులో... అసలేం జరిగింది...
 
హై ప్రొఫైల్ లేడీ ఇంద్రాణి ముఖర్జీయా కుమార్తె షీనా బోరా హత్య వ్యవహారం రకరకాల ట్విస్టులతో ముందుకెళుతోంది. ఆమె హత్య ఎలా జరిగిందన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రస్తుతం ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. రాయ్ గఢ్ జిల్లా సమీపంలోని అడవిలో షీనా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇపుడు మళ్లీ ఆ మృతదేహం తాలూకు పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. 
 
మరోవైపు కేసులో కీలకంగా ఉన్న ఇంద్రాణి కుమారుడు మిఖాయిల్ బోరాను బాంద్రా పోలీసు స్టేషను నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది. అతడిపై హత్యా యత్నం జరిగే అవకాశం ఉన్నదని అనుమాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఈ జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఇంకోవైపు కేసును ఛేదించేందుకుగాను పీటర్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా అతడికి కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలను రాబట్టనున్నారు.