శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2015 (10:42 IST)

మీరు గజదొంగలు.. నేను చిన్నదొంగను.. ఇదేనా సుష్మా స్వరాజ్ ఎదురుదాడి సందేశం!

పార్లమెంట్ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచి సభా కార్యక్రమాలను లలిత్ మోడీ అంశం ఓ కుదుపు కుదుపుతోంది. ఈ విషయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ ఉడుంపట్టుపట్టింది. అదేసమయంలో బీజేపీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే, బుధవారం మంత్రి సుష్మా స్వరాజ్ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అనుమతిచ్చారు. దీంతో సభలో ఒక్కసారి యుద్ధవాతావరణం నెలకొంది.
 
 
వారం రోజుల క్రితం రాజ్యసభలో నాలుగు రోజుల క్రితం లలిత్ మోడీ వ్యవహారంలో లోక్‌సభలో ప్రకటన చేసినప్పుడు.. సుష్మాస్వరాజ్ స్వరం మామూలుగానే ఉంది. తానేమీ తప్పు చేయలేదని.. అనవసరంగా ఆందోళన చేస్తున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేశారు. కానీ ఈ వ్యవహారంపై లోక్‌సభలో చర్చ మొదలైన తర్వాత సుష్మా స్వరాజ్ దీన్నొక యుద్ధంగా మార్చేశారు. ప్రత్యర్థులపై ప్రచండంగా విరుచుకుపడ్డారు. క్విడ్ ప్రో కో, స్వప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై వివరణ ఇవ్వడంకంటే.. ఎదురు దాడి చేయడానికే ఆమె అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 
 
దివంగత రాజీవ్‌ గాంధీ నుంచి నిన్నటి మన్మోహన్‌ సింగ్ వరకు కాంగ్రెస్ పాలనలో జరిగిన స్కాములన్నింటినీ ఏకరవు పెట్టారు. పైగా... లలిత్ మోడీ వ్యవహారంలో తన కుటుంబం పాత్ర ఏమీ లేదని, ఎలాంటి లాభం పొందలేదని చిన్నసైజు వివరణ ఇచ్చారు. పనిలోపనిగా.. లలిత్ మోడీకి సేవలు చేస్తున్నా.. తాము ఒక్కపైసా కూడా డబ్బు తీసుకోలేదని సుష్మా చెప్పడం విడ్డూరంగా ఉంది. పైపెచ్చు తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఏ తప్పు చేయలేదని.. ఇప్పుడు తప్పు చేస్తానా అంటూ ఎదురు ప్రశ్నించారు.
 
సుష్మా స్వరాజ్ సమాధానం ఆద్యంతం ఆవేశపూరితంగానే సాగింది. మీరు గజదొంగలు నేను చిన్న దొంగను అని పార్లమెంట్‌ సాక్షిగా మాట్లాడడం సిగ్గు చేటు. ఒక తప్పైనా రెండు తప్పులైనా ఎన్ని తప్పులైనా కాపాడేవాళ్లుంటే ఎంతకైనా తెగించొచ్చు. ఏమైనా మాట్లాడవచ్చు. ఎన్ని నీతి వాక్యాలైనా వినేవాళ్లుంటే చెప్పొచ్చు. ఆ పనే చేయాలంటే ప్రవచనకారుల్లా మారొచ్చు. సుష్మా స్వరాజ్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు దేశానికి ఎలాంటి సందేహం ఇవ్వాలని కోరుకుంటుందో వేచిచూడాల్సిందే.