శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : ఆదివారం, 26 జూన్ 2016 (11:55 IST)

ఒక్క ఛాన్స్ ప్లీజ్... తిరుపతి మేయర్‌ కుర్చీ కోసం నేతల పాట్లు వెంకన్నకే ఎరుక!

తిరుపతి నగర పాలకసంస్థ ఎన్నికలు అక్టోబరు నెలలో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించగానే స్థానిక నాయకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. తిరుపతి మేయర్‌ పదవికి మొత్తం మహిళలే పోటీ పడుతుండడంతో ఎన్నికలు రసవత్తర

తిరుపతి నగర పాలకసంస్థ ఎన్నికలు అక్టోబరు నెలలో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించగానే స్థానిక నాయకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. తిరుపతి మేయర్‌ పదవికి మొత్తం మహిళలే పోటీ పడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి వంటి ప్రాంతానికి మేయర్‌గా ఉండడమనేది సామాన్యమైన విషయం కాదని నాయకుల నమ్మకం. దీంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మేయర్ పదవి కోసం పాట్లు పడుతున్నారు.
 
మీరు ఫోటోలో చూస్తున్న సిఎం చంద్రబాబునాయుడు సతీమణి నారాభువనేశ్వరి పక్కన ఉన్న మేడం పేరు రాళ్ళపల్లి సుధారాణి. ఈమె స్థానికంగా వైద్యురాలు. కంటి వైద్యురాలిగా ఈమె ఒక వైద్యశాలను నడుపుతుంటే ఆయన భర్త సుకుమార్‌ కూడా ఒక వైద్యుడే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కొన్నిరోజులకు ముందే వీరిద్దరు కలిసి రాజకీయాల్లోకి వచ్చారు. అందరితో కలిసేపోయే స్వభావం ఉన్న వీరు పదవి కోసం పాకులాడుతున్నారు.
 
భర్త సుకుమార్‌కు అసలు రాజకీయమంటే పెద్ద ఆశక్తి లేదు. మొత్తం మేడం సుధారాణిదే హవా. ఆమెకు ఏదైనా పదవి అధిరోహించాలన్నదే ఆయన కోరిక. దీంతో భార్య వెంట తిరుగుతూ ఉన్నాడీయన. ఇక సుధారాణి విషయానికొస్తే తాము ఆసుపత్రులలో సంపాదించిన మొత్తాన్ని తెదేపా పార్టీ కార్యక్రమాల కోసం సగానికిపైగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పటివరకు తమ ఆస్తిలోని సగానికిపైగా డబ్బును పార్టీ కార్యక్రమాలకే ఖర్చు పెట్టారంటే వీరు పదవి కోసం ఏ మాత్రం పాకులాడుతున్నారో ఇట్టే అర్థమైపోతుంది.
 
ముందు నుంచే స్థానిక ఎన్నికల కోసం వీరు కాసుకుని కూర్చున్నారు. వీరు ఒక్కరే కాదు మరో వైద్యురాలు డాక్టర్‌ ఆశాలత, తిరుపతికి చెందిన తెదేపా పట్టణాధ్యక్షుడు దంపూరి భాస్కర్‌ యాదవ్‌ సతీమణి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్‌ సతీమణి, మరో తెదేపా నాయకుడు అన్నా రామచంద్రయ్య కుటుంబ సభ్యుల్లో ఒక మహిళ. ఇలా అందరూ మహిళలే మేయర్‌ పదవి కోసం పోటీలు పడుతున్నారు. ఎవరికి ఉన్న పరిచయాలతో వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
 
అయితే వైద్యురాలు సుధారాణి మాత్రం తనకు ఉన్న పరిచయాలతో చంద్రబాబు, నారా లోకేష్‌ ఇలా ఒక్కొక్కరికీ ఇప్పటికే దగ్గరయ్యారు. తాజాగా ఎన్‌టిఆర్‌ పేరుతో ఉచిత వైద్యాన్ని అందించేందుకు స్వయంగా తమ డబ్బులతో ఒక ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేశారు. అది కూడా ఎక్కడో కాదు ముఖ్యమంత్రి పుట్టిపెరిగిన ప్రాంతంలోనే. శనివారం కాశిపెంట్లలో ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్య సేవా కేంద్రాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఎన్‌టిఆర్‌ సెంటిమెంట్‌తో భువనేశ్వరికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఈ దంపతులు. అంతేకాదు తమకు మేయర్‌ పదవి ఇస్తే ఎంత డబ్బునైనా పార్టీకి ఫండ్‌‌గా కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 
 
ఇదొక్కటే కాదు ఎన్నికల సమయంలో పార్టీ నుంచి ఎలాంటి ఫండ్‌ కూడా తమకు అవసరం లేదట. తమ సొంత ఖర్చులతోనే ఎన్నికల్లో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని నారా లోకేష్‌ దృష్టికి ఈ దంపతులు ఇప్పటికే తీసుకెళ్ళారు. వీరు ఒక్కటే ఆ విషయాన్ని చెప్పారని మాత్రం అనుకోకండి.. పోటీ పడుతున్న ప్రతి మహిళ ఇదే విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళుతున్నారు. మరి తిరుపతి లాంటి ప్రాంతంలో మేయర్‌ పదవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. వీళ్లందరూ ఎన్ని పాట్లు.. పీట్లు చేసినా బాబు ఎవరికి పదవి ఇస్తారో వేచి చూడాల్సిందే.