శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: బుధవారం, 1 ఆగస్టు 2018 (14:25 IST)

తిరుమల కొండపై రమణ దీక్షితులు పెంపుడు కుక్కలను కూడా తితిదే టచ్ చేయలేకపోయింది... ఎందుకో?

దాదాపు రెండున్నర నెలల తరువాత టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తిరుమల చేరుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకాలం తిరుమలకు రాని రమణదీక్షితులు ఇప్పుడే ఎందుకు వచ్చారన్న అనుమానాలు అటు ప్రభుత్వంలోను, ఇటు టిటిడిలోను సెగలు రేపుతున్నాయి. ఇప్పటికే కోర

దాదాపు రెండున్నర నెలల తరువాత టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తిరుమల చేరుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకాలం తిరుమలకు రాని రమణదీక్షితులు ఇప్పుడే ఎందుకు వచ్చారన్న అనుమానాలు అటు ప్రభుత్వంలోను, ఇటు టిటిడిలోను సెగలు రేపుతున్నాయి. ఇప్పటికే కోర్టులో ఎంపి సుబ్రమణ్యస్వామి కేసు దాఖలు చేసిన నేపథ్యంలో ఆధారాల కోసమే రమణదీక్షితులు తిరుమలకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇంటిలోని పలు కీలక డాక్యుమెంట్లను సేకరించిన ఆయన త్వరలోనే వాటిని కోర్టులో సబ్‌మిట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
 
రెండున్నర నెలలుగా రమణదీక్షితులు తిరుమలకు రాకున్నా ఆయనకు కేటాయించిన గది దగ్గరకు ఎవరూ వెళ్ళకపోవడం గమనార్హం. సాధారణంగా ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తరువాత వారికి కేటాయించిన క్వార్టర్స్‌ను ఖాళీ చేయిస్తుంది టిటిడి. అయితే రమణదీక్షితులపై పదవీ విరమణ వేటు వేసినప్పటికీ ఇంతవరకు ఆయన ఇంటి గేటు దగ్గరకు కూడా సిబ్బందిని పంపే ప్రయత్నం చేయలేదు టిటిడి. పైగా రమణదీక్షితులు తన పెంపుడు కుక్కలతో రెండున్నర నెలలుగా తిరుమలలోని తన క్వార్టర్స్‌కు కాపలా ఉంచడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. కుక్కలు ఆయన నివాసం బయటే ఉన్నా వాటిని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం కూడా టిటిడి అధికారులు చేయకపోవడం గమనార్హం. 
 
మరోవైపు తిరుమలకు వచ్చిన రమణదీక్షితులను వైసిపి నేత, మాజీ టిటిడి బోర్డు ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్ళి మరీ ఏకాంతంగా కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశం ఏమిటో తెలియక, రమణదీక్షితులు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు టిటిడి అధికారులు. ఇదిలాఉంటే టిటిడిపైన సుబ్రమణ్యస్వామి వేసిన కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన టిటిడితో పాటు ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తోంది. ఈ పిటిషన్ పైన సిబిఐ విచారణ వేస్తే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. 
 
అలాగే సుబ్రమణ్యస్వామి పిటిషన్‌తో పాటు రమణదీక్షితులు కూడా స్వయంగా పిటిషన్‌ను త్వరలో వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పక్కా ఆధారాల కోసమే రమణదీక్షితులు తిరుమలకు వచ్చి వాటిని సేకరించడమే కాకుండా ఎలా ముందుకు వెళ్ళాలన్నదానిపై వైసిపి నేతలతో చర్చించినట్లు భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా టిటిడి అధికారులు గానీ, బోర్డు సభ్యులు గానీ రమణదీక్షితులను కలిసే ప్రయత్నం చేయలేదు. పదవీ విరమణ అయిన నేపథ్యంలో కనీసం ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా కూడా ఇప్పటివరకు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రమణదీక్షితుల వ్యవహారంలో టిటిడి ఎలా ముందుకు వెళుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రమణదీక్షితులతో పాటు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి నోటీసులు పంపింది టిటిడి.