శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:22 IST)

మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే?

మనం గరంగరంగా చేసే వంటలలో మిరియాలు తప్పనిసరి. ప్రతి ఇంటిలోని పోపు డబ్బాలో ఈ దినుసు కనిపిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. మిరియాలను అప్పట్లో బ్రిటిష్ వారు కూడా ఎగుమతి చేసుకునే వారు. ఇంత ప్రాశస్త్యం పొందిన మిరియాల వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జలుబు చేసినా, జ్వరం వచ్చినా మిరియాలను వాడటం మనం చూస్తుంటాం. 
 
వీటిలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని మనం నిత్యం తీసుకునే ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్యాల నుండి బయటపడవచ్చు. వాటి వలన కలిగే కొన్ని ప్రయోజనాలు చూద్దాం. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది. వీటిని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మిరియాలలో మరికొన్ని రకాలు ఉన్నాయి. 
 
అవి తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగు మిరియాలు. ఆహారం తినకుండా మారాం చేసే పిల్లలకు ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి రోజూ పెట్టడం వలన ఆకలి పెరుగుతుంది. మిరియాల పైపొరలో ఉండే ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకోకుండా కాపాడతాయి. 
 
ఫలితంగా రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు పెరగకుండా కూడా చూసుకోవచ్చు. ఆందోళన, ఒత్తిడి నుండి బయటపడటానికి మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం తోడ్పడుతుంది. శీతాకాలంలో జలుబు, దగ్గుతో బాధపడేవారు పాలలో మిరియాల పొడి కలుపుకుని తాగాలి లేదా మిరియాల రసం తాగితే కూడా మంచిదే. 
 
50 గ్రాముల మిరియాల పొడిని 600 మిలీ నీళ్లలో చేర్చి అరగంట మరిగించాలి. ఆ నీటిని రోజుకు మూడుసార్లు తాగితే మంచిది. మిరియాల టీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక వ్యవస్థకు చేరుస్తుంది. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు, నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.