శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (12:01 IST)

తిరుపతిని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ - మాస్క్‌తో తిరుపతికి రండి...!

తిరుపతి నగరాన్ని స్వైన్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. గ్రామాలకు గ్రామాలు జ్వరాల బారినపడి మంచానికి పరిమితమవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారు. దీంతో తమకు వచ్చింది ఏ జ్వ

తిరుపతి నగరాన్ని స్వైన్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. గ్రామాలకు గ్రామాలు జ్వరాల బారినపడి మంచానికి పరిమితమవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారు. దీంతో తమకు వచ్చింది ఏ జ్వరమో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు సామాన్యప్రజలు. ఉమ్మడి రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ నమోదవుతున్న నేపథ్యంలో తమకు వచ్చిన జ్వరాలతో చిత్తూరు జిల్లా వాసులు వణికిపోతున్నారు. స్వైన్ ఫ్లూ పరీక్షలు తిరుపతి రుయాసుపత్రికి రోగులు పోటెత్తుతున్నారు.
 
స్వైన్ ఫ్లూ వైరస్ అనేది అతి వేగంగా వ్యాపించే అంటురోగం. దానికి చలితోడైతే అది ఒకరి నుంచి మరొకరికి అతి త్వరగా వ్యాపించే అవకాశాలున్నాయి. వైద్యం పరంగా చూస్తే ఇప్పటికీ స్వైన్ ఫ్లూ గుర్తించే పరికరాలే తమ వద్ద లేవంటున్నారు వైద్యాధికారులు. రాయలసీమ వ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్న తిరుపతి రుయాసుపత్రికి వందల సంఖ్యలో రోగులు వస్తున్నారు. వచ్చిన వారిలో ఎక్కువమంది తీవ్రజ్వరాలతో బాధపడుతున్న వారే. కానీ తమకు ఎక్కడ స్వైన్ ఫ్లూ ఉందోనని భయపడిపోతున్నారు. 
 
తమకు వచ్చిందో ఏ జ్వరమో తెలుసుకోవడం కోసం ఆసుపత్రికి వచ్చినప్పటికీ స్వైన్ ఫ్లూకి సంబంధించిన పరీక్షలు చేయడానికి సరైన సౌకర్యాలు రుయాలో అందుబాటులో లేవు. దీంతో వచ్చిన వారికి మామూలు ట్రీమెంట్ ఇచ్చి పంపించేస్తున్నారు వైద్యులు. ఆ విధంగా ఆసుపత్రికి వచ్చిన వారిలో కడప జిల్లా రాజంపేటకు చెందిన చెంచయ్య అనే వ్యక్తికి స్వైన్ ఫ్లూ అని తేలింది. మరో మహిళకు స్వైన్ ఫ్లూ పాజిటివ్ రావడంతో ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటానంటూ వెళ్ళిపోయింది. మరో 8 మంది తీవ్రజ్వరాలతో బాధపడుతుంటే వారిని కూడా రుయావైద్యులు పరీక్షించారు. 
 
ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వేలమంది భక్తులు వచ్చే ఆధ్మాత్మిక నగరం కావడంతో స్వైన్ ఫ్లూపై తితిదే కూడా అప్రమత్తమైంది. తితిదే ఈఓ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వీలైనన్ని మాస్కులను అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చిన్న చిన్న జ్వరాలకు ప్రజలు భయపడవద్దని స్వైన్ ఫ్లూ అంత ఈజీగా రాదని, ఒకవేళ వచ్చినా కూడా దానిని తగ్గించడానికి తమ వద్ద మందులు ఉన్నాయంటున్నారు రుయా వైద్యులు. మామూలు జ్వరమే కదా అని ఆర్‌ఎంపి డాక్టర్ల వద్ద చూపించుకుని సైలెంట్‌గా ఉండకుండా స్వైన్ ఫ్లూ పట్ల మీకేమాత్రం అనుమానంగా ఉన్నా వెంటనే తమను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు వైద్యులు.