బంగ్లాదేశ్ ఆలయంలో తొక్కిసలాట.. పది మంది మృతి, 30 మందికి గాయాలు..!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో ఉన్న ప్రసిద్ధి చెందిన లంగల్ బంద్ పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. లంగల్ బంద్ దేవాలయానికి శుక్రవారం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.
దీంతో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట చోటుచేసుకుంది. చనిపోయిన వారంతో యాభైఏళ్లు పైబడినవారని సమాచారం. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారని స్థానిక పోలీసు ఉన్నతాధికారి మజురూల్ ఇస్లాం తెలిపారు. ఇక్కడి పాత బ్రహ్మపుత్ర నదీతీరంలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో బంగ్లాదేశీయులతో పొరుగు దేశీయులైన భారతీయులు, నేపాలీయులు కూడా పుణ్యస్నానాలు చేస్తారు. కాగా చైత్ర అష్టమి సందర్భంగా ఇక్కడ పుణ్యస్నానం చేస్తే తమ పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.