శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (07:03 IST)

ట్రంప్ మాడు పగిలింది: ఫెడరల్ కోర్టు ఆదేశాలతో సీన్ రివర్సయింది

యావత్ ప్రపంచం వ్యతిరేకస్తున్నా, వలస ప్రజలపై నిషేధం అమానుషమని అమెరికా యావత్తు గొంతు చించుకుంటున్నా చలించని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ ఫెడరల్ కోర్టు దెబ్బకు గింగరాలు తిరిగి కింద పడ్డారు. అధ్యక్

యావత్ ప్రపంచం వ్యతిరేకస్తున్నా, వలస ప్రజలపై నిషేధం అమానుషమని అమెరికా యావత్తు గొంతు చించుకుంటున్నా చలించని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ ఫెడరల్ కోర్టు దెబ్బకు గింగరాలు తిరిగి కింద పడ్డారు.  అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక దూకుడుగా ముందుకెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇది తొలి ఎదురుదెబ్బ. వీసాల రద్దు నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన తలెత్తినా పట్టించుకోని ప్రభుత్వం.. శుక్రవారం అర్ధరాత్రి సియాటెల్‌ జిల్లా ఫెడరల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో తన ఆదేశాలను వెనక్కుతీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఏడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చే వారిపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. 60వేల వీసాలను పునరుద్ధరించినట్లు వెల్లడించింది. 
 
జడ్జి ఆదేశాలపై ఉన్నత న్యాయ స్థానంలో అప్పీలు చేయాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించింది. ‘జడ్జి ఉత్తర్వుల ప్రకారం కార్యనిర్వాహక ఆదేశాల్లోని అంశాల అమలును తక్షణమే ఆపేస్తున్నాం. గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సోదాలు నిర్వహిస్తాం’ అని అమెరికా అంతర్గ భద్రత శాఖ మరో ప్రకటనలో తెలిపింది. అయితే, వీసాల రద్దు సరైనది, చట్టపరమైనదని.. జడ్జి ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్‌ చేసి తిరిగి వీసాల రద్దును అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని వెల్లడించింది. ‘దేశ శ్రేయస్సుకోసం అధ్యక్షుడు తీసుకొచ్చిన చట్టపరమైన కార్యనిర్వాహక ఆదేశాలను కొనసాగించేలా.. కోర్టు నిర్ణయంపై వీలైనంత త్వరగా స్టే కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాం’ అని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
 
అంతకుముందు, వాషింగ్టన్‌ అటార్నీ జనరల్‌ బాబ్‌ ఫెర్గూసన్‌ చేసిన ఫిర్యాదుపై శుక్రవారం అర్ధరాత్రి విచారణ జరిపిన సియాటెల్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జి జేమ్స్‌ రాబర్ట్‌.. వీసా రద్దుపై ట్రంప్‌ తీసుకొచ్చిన ఆదేశాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘అధ్యక్షుడి నిర్ణయం దేశ ప్రజలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఉపాధి, విద్య, వ్యాపారం, కుటుంబ సంబంధాలు, స్వతంత్రత, పర్యాటకం వంటి రంగాల్లో ఇబ్బందులు తప్పవు. ఫిర్యాదుదారు (వాషింగ్టన్‌ అటార్నీ జనరల్‌ ఫెర్గూసన్‌) రాజ్యాంగం తనకిచ్చిన హక్కులను పొందాలనుకుంటున్నారు. ట్రంప్‌ నిర్ణయం వల్ల దేశ ప్రజలకు కోలుకోలేని ఇబ్బందులు తలెత్తవచ్చు’ అని తన ఆదేశాల్లో జడ్జి పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో నిరసనకారులతోపాటు ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ‘ఇది రాజ్యాంగ విజయం. అధ్యక్షుడు సహా ఎవరూ చట్టానికన్నా గొప్పవారు కాదు’ అని ఫెర్గూసన్‌ వెల్లడించారు.  
 
వీసాల రద్దు నిర్ణయాన్ని ప్రస్తుతానికి వెనక్కు తీసుకోవటంతో అమెరికా వెళ్లాలనుకున్న ప్రయాణికులకు పలు విమానయాన సంస్థలు (ఎయిర్‌ ఫ్రాన్స్, కతార్‌ ఎయిర్‌వేస్, లుఫ్తాన్సా, స్విస్‌ ఎయిర్‌వేస్‌) పచ్చజెండా ఊపాయి. అయితే, ఉగ్రవాదులను దేశం నుంచి తరిమేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. అమెరికన్లు స్వేచ్ఛగా, భద్రంగా ఉన్నామనే వాతావరణాన్ని కల్పించటం తన బాధ్యతని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. శాశ్వత నియంత్రణ వ్యవస్థను నిర్మించేందుకే వీటిని జారీచేశాం. దీని ద్వారా అమెరికాకు వచ్చి ఇక్కడి మనుషులతో ప్రేమగా, మద్దతుగా ఉండేవారిని గుర్తించొచ్చు’ అని ట్రంప్‌ తెలిపారు. ఈ ఆదేశాల విషయంలో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
 
ఏడు ముస్లిం మెజారిటీ దేశాలనుంచి వలసలపై తను తీసుకున్న కార్యనిర్వాహక ఆదేశాలపై సియాటెల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి తాత్కాలికంగా నిషేధం విధించటంపై ట్రంప్‌ మండిపడ్డారు. ‘జడ్జిది పిచ్చి నిర్ణయం’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం అర్థరాత్రి వెల్లడైన ఆదేశాలపై స్పందిస్తూ.. ‘సోకాల్డ్‌ న్యాయమూర్తి (జేమ్స్‌ రాబర్ట్‌) తీసుకున్న నిర్ణయం దేశం నుంచి చట్టాన్ని వేరుచేస్తోంది. ఇది పిచ్చి నిర్ణయం. ఇది తిరగబడుతుంది’ అని ట్విటర్‌ వేదికగా ఆగ్రహించారు. ‘దేశంలోకి ఎవరు రావొచ్చు, ఎవరు రాకూడదో చెప్పలేని పరిస్థితిలో ఉన్న దేశంలో భద్రత విషయంలో ఓ స్పష్టత లేకపోతే ప్రమాదం ముంచుకొచ్చినట్లే. ఈ నిషేధాన్ని మధ్య ప్రాచ్యదేశాలూ ఆమోదించిన విషయాన్ని మరవొద్దు’ మరో ట్వీట్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు.  
 
మొత్తానికి ట్రంప్‌కు ఫెడరల్ జడ్జి ముకుతాడు వేసారు. అమెరికా న్యాయం అమెరికా అధ్యక్షుడి కన్నా గొప్పదని తేల్చి చెప్పారు. ఈ తీర్పు అమెరికాకే కాదు.. వివక్ష ప్రాతిపదికన ప్రజలను వేరుచేయాలని, విడదీయాలని చూసే ఏ పాలకులకైనా, ఏ వ్యవస్థకైనా ఇది గొడ్డలి పెట్టు లాంటి తీర్పు. కొన్ని లక్షలమంది ప్రయాణికులను ఉట్టి పుణ్యానికి వేధించిన, భయభ్రాంతులకు గురిచేసిన రక్కసి చట్టంపై స్టే విధించడం ప్రపంచ మానవ హక్కులకు పెను విజయంగానే భావించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అమెరికన్ న్యాయచరిత్రలో ఓ కలికితురాయి.