శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (11:36 IST)

సిద్ధివినాయక టెంపుల్ వద్ద 20 వరకూ తాయెత్తులు కొన్నాం.. సాజిద్ మెచ్చుకున్నారు: హెడ్లీ

ముంబై దాడుల కేసు నిందితుడు డేవిడ్ హెడ్లీ రోజుకో కొత్త బాంబు పేలుస్తున్నాడు. గుజరాత్ ఎన్‌కౌంటర్లో మరణించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇష్రాత్ జహాన్.. లష్కరే తోయిబా ఆత్మాహుతి దళ సభ్యురాలని చెప్పిన డేవిడ్ హెడ్లీ.. ఉగ్రవాదులను హిందువులుగా చూపెట్టేందుకు తాము చేసిన పనులన్నీ వివరించాడు. ముంబై కోర్టు నుంచి అమెరికాలో ఉన్న హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాలుగో రోజు విచారిస్తుండగా, ఉగ్రవాదుల కోసం సిద్ధివినాయక దేవాలయం నుంచి తాయెత్తులు, చేతులకు కట్టుకునే దారాలను కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. 
 
ఇవి చేతులకు ఉంటే, ఉగ్రవాదులన్న అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు. 26/11 దాడులకు ముందు గేట్ వే ఆఫ్ ఇండియా, కుఫీ పరేడ్ ప్రాంతాలను సందర్శించి, చివరకు తమ దాడికి కుఫీ పరేడ్ అనుకూలమన్న నిర్ణయానికి వచ్చామని తెలిపాడు. 2008లో ఏప్రిల్ 9 నుంచి 15 వరకూ ముంబైలోని పలు ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించినట్లు డేవిడ్ హెడ్లీ విచారణలో వెల్లడించాడు. పాకిస్థాన్‌కు వెళ్ళి సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ తదితరులను కలిసి దాడుల నిమిత్తం వెళ్లేవారిని ఎక్కడకు పంపాలనే విషయాన్ని వీడియో ద్వారా వివరించినట్లు హెడ్లీ తెలిపాడు.
 
ముంబై ఎయిర్ పోర్టులోనూ రెక్కీ నిర్వహించి, అక్కడ దాడి సాధ్యం కాదని తాను చెబితే, మేజర్ ఇక్బాల్ కొంత అసహనాన్ని ప్రదర్శించాడని తెలిపాడు. అయితే సిద్ధివినాయక టెంపుల్ వద్ద 20 వరకూ బ్యాండ్లు కొన్నానని, వీటిని సాజిద్ మీర్‌కు ఇస్తే, మంచి ఆలోచన చేశావని అభినందించాడని గుర్తు చేసుకున్నాడు. శివసేన లష్కరే తోయిబా హిట్ లిస్టులో ఉందని హెడ్లీ వెల్లడించాడు.