శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:43 IST)

48 గంటల్లో 3 వేల మంది తాలిబన్ తీవ్రవాదులను ఉరితీయండి: షరీఫ్‌కు ఆర్మీ చీఫ్!

పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ తీవ్రవాదులు సృష్టించిన మారణహోమంతో పాకిస్థాన్‌ సైనికుల రక్తం ఉడికిపోతోంది. ఈ మారణహోమానికి ప్రతీకారంగా దేశంలోని ఉగ్రవాదులందరినీ ఉరి తీయాలని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రాహీల్ షరీఫ్ సూచించారు. అదీ కూడా 48 గంటల్లోగా మూడు వేల మంది ఉగ్రవాదులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి ఆయన సందేశం పంపారు. ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్‌పై విడుదలైన మరుసటి రోజే ఆయన ఈ మేరకు ప్రధానికి సందేశం పంపడం గమనార్హం. 
 
పెషావర్ సైనిక పాఠశాల ఘటనను ప్రస్తావించిన షరీఫ్ తాలిబన్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ట్వీట్లు చేశారు. ‘తాలిబన్లకిదే హెచ్చరిక. మీరు మా పిల్లలను చంపేశారు. దీనికి మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి. చనిపోయిన చిన్నారుల ప్రతి రక్తపుబొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం’ అని ఆ ట్వీట్లలో షరీఫ్ తీవ్రవాదులను హెచ్చరించారు. మరోవైపు.. ముంబై దాడి కేసులో ప్రధాన సూత్రధారి లఖ్వీకి పాక్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.