శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (13:11 IST)

భారత్‌లో శిశు మరణాల సంఖ్య అధికం : సమితి గణాంకాలు

పలు కారణాల రీత్యా భారత్‌లో శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించింది. 1990 నుంచి శిశు మరణాలను అరికట్టేందుకు భారత్ ప్రత్యేకంగా దృష్టిసారించినప్పటికీ.. ఇప్పటికీ వాటిని అరికట్టలేక పోతోందని ఐరాస తెలిపింది. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన తాజా గణాంకాల మేరకు 1990లో భారత్‌లో 33.3 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడగా, ఆ సంఖ్య 2013లో 13.4 లక్షల మంది చిన్నారులకు పరిమితమైందని నివేదికలు వెల్లడించాయి. 
 
రెండు దశాబ్దాల కాలంలో భారత్ అద్భుతమైన పురోగతి సాధించినప్పటికీ, నేటికీ భారత్‌లోనే అత్యధిక శిశుమరణాలు సంభవించడం దురదృష్టకరమని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో సగం మరణాలు భారత్ (21 శాతం), నైజీరియా (13 శాతం), పాకిస్థాన్, కాంగో, చైనాల్లో నమోదవుతున్నాయని వెల్లడించింది. కాగా, నవజాత శిశు మరణాలను నివారించడంలో భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అయితే, వీరిలో ఎక్కువగా నివారించదగ్గ రోగాల బారిన పడి మృతి చెందుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.