ఫోర్బ్స్ జాబితా: నలుగురు భారతీయ మహిళలకు చోటు!
ఫోర్బ్స్ ప్రకటించిన '100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో నలుగురు భారతీయ మహిళలు స్థానం సంపాదించుకున్నారు. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ తొలిస్థానంలో నిలిచిన ప్రపంచ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చంద కొచ్చర్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, హెచ్ టీ మీడియా చైర్ పర్సన్ శోభనా భార్తియాలకు చోటు దక్కింది.
అరుంధతీ భట్టాచార్య 30వ స్థానంలో, చంద కొచ్చర్ 35, కిరణ్ మజుందార్ షా 85, శోభనా భార్తియా 93వ స్థానాల్లో నిలిచారు. గత సంవత్సరంతో పోలిస్తే అరుంధతీ భట్టాచార్య ఆరు స్థానాలు, కొచ్చర్ 8 స్థానాలు, మజుందార్ షా 7 స్థానాలు ఎగబాకారు. వీరితో పాటు భారత సంతతికి చెందిన మరో ఇద్దరూ జాబితాలో స్థానం సంపాదించారు. పెప్సీకో చీఫ్ ఇంద్ర నూయి, సిస్కో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్లకు స్థానం దక్కింది.