శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 15 ఏప్రియల్ 2017 (01:07 IST)

హ్యాట్రిక్‌తో పుణె నడ్డివిరిచిన గుజరాత్‌.. ఐపీఎల్-10 సీజన్‌లో తొలి బోణీ

ఐపీఎల్ -10 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని మూటగుట్టుకున్న రైనా సేన.. సొంతగడ్డపైనే తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం రాత్రి రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో పుణె సూపర్‌ జెయింట్స్‌ విసిరిన 172 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్ల తేడాతో మరో రెండు ఓవర్ల

ఐపీఎల్ -10 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని మూటగుట్టుకున్న రైనా సేన.. సొంతగడ్డపైనే తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం రాత్రి రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో పుణె సూపర్‌ జెయింట్స్‌ విసిరిన 172 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్ల తేడాతో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది. ఓపెనర్లు మెక్‌కల్లం(49), డ్వెయిన్‌ స్మిత్‌(47) అద్భుతంగా ఆడి గెలుపును సునాయాసం చేయగా, కెప్టెన్‌ సురేశ్‌ రైనా(35), ఆరోన్‌ ఫించ్‌(33)లు సమయోచిత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. 18 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదుచేసుకున్నారు.



హ్యాట్రిక్‌తో పుణె నడ్డివిరిచిన గుజరాత్‌ బౌలర్‌ ఏజే టై(4-0-17-5)కు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. పుణె బౌలర్లు ఏమాత్రం తమ ప్రతిభను ప్రదర్శించలేకపోయారు. ఫీల్డింగ్‌లోనూ విఫలమయ్యారు. శార్దుల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, రాహుల్‌ చాహర్‌ తలో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.
 
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె ఆదిలోనే ఓపెనర్ అజింక్యా రహానే వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్ లోనే రహానే డకౌట్‌గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి-స్టీవ్ స్మిత్ ల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ జోడి 64 పరుగులు జోడించిన తరువాత రాహుల్ త్రిపాఠి(33)రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో స్టీవ్ స్మిత్(43) పెవిలియన్ చేరాడు. దాంతో పుణె స్కోరు బోర్డులో వేగం తగ్గింది. పుణె మిగతా ఆటగాళ్లలో బెన్ స్టోక్స్(25), మహేంద్ర సింగ్ ధోని(5)లు కూడా రాణించలేదు.
 
ఆ తరుణంలో అంకిత్ శర్మ-మనోజ్ తివారీ జోడి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. ఈ జోడి 47 పరుగులు జోడించడంతో పుణె గాడిలో పడింది. అయితే చివరి ఓవర్ లో వరుసగా మూడు వికెట్లను పుణె కోల్పోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఆండ్రూ టై ఐదు వికెట్లు సాధించగా,  రవీంద్ర జడేజా, ప్రవీణ్ కుమార్, డ్వేన్ స్మిత్ లు తలో వికెట్ తీశారు.