శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (12:12 IST)

సొంతగడ్డపై ఖంగుతిన్న రాయల్ ఛాలెంజర్స్: చెన్నై గెలుపు!

సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్స్ ఖంగుతింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. రైనా (32 బంతుల్లో 62) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు నెహ్రా (4/10) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభించారు. చెన్నై నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు ఓవర్లన్నీ ఆడి ఎనిమిది వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసింది.
 
కోహ్లీ (42 బంతుల్లో 51) ఒంటరి పోరాటం చేశాడు. వీస్‌ (22) పర్వాలేదనిపించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 181 పరుగులు చేసింది. రైనాతో పాటు డ్వేన్‌ స్మిత్‌ (29 బంతుల్లో 39), డుప్లెసిస్‌ (18 బంతుల్లో 33 నాటౌట్‌) మెరిశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ మూడు వికెట్లు పడగొట్టగా, ఇక్బాల్‌ అబ్దుల్లా రెండు వికెట్లు తీశాడు. రైనాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.
 
టోర్నీలో నాలుగో విజయం సాధించిన చెన్నై 8 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిన బెంగళూరు రెండు పాయింట్లతో అట్టడుగున ఉంది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లుబిస్లా (17), రోసో (14) బౌండ్రీలతో అలరించడంతో తొలి మూడు ఓవర్లలోనే ముప్పై పరుగులు వచ్చాయి. అయితే నాలుగో ఓవర్లో వీరిద్దరినీ అవుట్‌ చేసిన నెహ్రా బెంగళూరుకు షాకిచ్చాడు. 
 
మిడాఫ్‌లో డుప్లెసిస్‌ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కు బిస్లా పెవిలియన్‌ చేరగా, రోసో క్లీన్‌బౌల్డయ్యాడు. బ్రావో పట్టిన అద్భుత క్యాచ్‌కు దినేశ్‌ కార్తీక్‌ (10) వెనుదిరిగాడు. డివిల్లీర్స్‌ (14) రనౌటయ్యాడు. అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (11)ను జడేజా అవుట్‌ చేశాడు. ఇక అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లీతో పాటు హర్షల్‌ (0)ను నెహ్రా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో బెంగళూరు ఓటమి ఖరారైంది.