శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (19:11 IST)

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు ఇవే....

రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఇందులో ఆ ఇండస్ట్రీస్ సారథి ముఖేష్ అంబానీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ జియో మూడో వార్షికోత్సవం సందర్భంగా వచ్చే సెప్టెంబరు ఐదో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జియో ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తెస్తామని అంబానీ వెల్లడించారు. 
 
100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీ పీఎస్‌ వరకు డేటా ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. అలాగే వెల్‌ కం ప్లాన్‌ కింద కస్టమర్లకు 4కే ఎల్‌డీ టీవీ, 4జీ హెచ్‌డీ సెట్‌టాప్‌బాక్స్‌ పూర్తిగా ఉచితం అందిస్తామన్నారు. తద్వారా 5 లక్షల కుటుంబాలకు ఉచిత ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జియో ఫైబర్ సబ్‌స్క్రైబర్స్‌కు ల్యాండ్‌ లైన్‌ ద్వారా ఇంటి నుంచి అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్ అందించనుంది. 
 
అంతేకాకుండా, రూ.500 లకే అమెరికా, కెనడాకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రీమియం కస్టమర్లు ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రాతిపదికన కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించి  పూర్తి వివరాలు జియో.కాం ద్వారా సెప్టెంబరు 5నుంచి అదుబాటులో వుంటాయని తెలిపారు. అలాగే  రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుందని తెలిపారు. జియో ఫైబర్‌నెట్‌ ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో జత కట్టినట్టు వెల్లడించారు.
 
ముఖ్యంగా జియోతో హై ఎండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయవచ్చో లైవ్‌గా చేసి చూపించారు ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్ల పైనే వీడియో కాలింగ్‌ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చో ప్రదర్శించారు. ప్రపంచంలో ఏమూలనున్నవారితోనైనా వీడియో కాలింగ్‌, కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకోవచ్చని తెలిపారు. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. 
 
గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్, వీఆర్‌తో షాపింగ్‌ అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఇంటి వద్ద నుంచే మనకు సరిపడే దుస్తుల షాపింగ్ చేయవచ్చని తెలిపారు. అంతేకాదు ఇంట్లో థియేటర్‌ అనుభవాన్ని ఎలా పొందవచ్చో కూడా చూపించి ఆకట్టుకున్నారు.