మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:34 IST)

మెడలో మోడీ ఫోటోతో ప్రచారం చేస్తున్న వృద్ధుడు హత్య

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. మెడలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను వేలాడదీసుకుని ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఓ వృద్ధుడుని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తంజావూరు సమీపంలోని ఒరత్తనాడు తెన్నమనాడు అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన గోవిందరాజు (70) అనే వృద్ధుడు వెటర్నరీ ఉద్యోగిగా పనిచేసి రిటైరయ్యారు. అనంతరం సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా ఒంటరిగా నివశిస్తున్నాడు. 
 
ఈయన ప్రధాని నరేంద్ర మోడీకి విరాభిమాని. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఓటు వేయాలంటూ ఒరత్తనాడు పరిసరాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ వచ్చాడు. శనివారం రాత్రి మోడీ చిత్రపటాన్ని మెడలో వేసుకుని ఒరత్తనాడు అన్నా విగ్రహం సమీపంలో ఇలాగే ప్రచారం చేస్తుండగా ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ గోపీనాథ్‌ (33) అతని వద్దకు వచ్చాడు.
 
మోడీకి ఎలా ప్రచారం చేస్తావంటూ అతనితో తగాదాకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆగ్రహం ఆపుకోలేని గోపీనాథ్‌, గోవిందరాజుపై దాడి చేశాడు. స్పృహతప్పి పడిపోయిన గోవిందరాజును స్థానికులు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. గోవిందరాజు కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు గోపీనాథ్‌ను అరెస్టు చేశారు. గోపీనాథ్‌ను డీఎంకే - కాంగ్రెస్‌ మద్దతుదారునిగా భావిస్తున్నారు.