గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 20 మార్చి 2019 (18:53 IST)

రంజుగా అనంతపురం రాజకీయాలు... బరిలో జేసీ పవన్ కుమార్ రెడ్డి

అనంతపురం జిల్లాలో ముగ్గురు రాజకీయ వారసులు రంగంలోకి దిగుతున్నారు. అందులోనూ దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న రెండు కుటుంబాల నుంచి వారుసుల రావడం.. వారంతా తెలుగుదేశం పార్టీ వారే కావడం విశేషం.
 
పరిటాల శ్రీరాం తండ్రి పరిటాల రవి. ఒకప్పుడు కమ్యూనిజం భావజాలంతో ఉండే రవిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర వేశారు. ఆయన ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన తరువాత ఆ స్థానంలో శ్రీరాం రావాల్సి ఉన్నా అప్పుడు చాలా చిన్న వయసు కావడంతో పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. 
 
ఆమె 14 ఏళ్ల రాజకీయం అనంతరం ఆ స్థానాన్ని కొడుకు శ్రీరాంకు అప్పగించారు. 28 ఏళ్ల వయసున్న శ్రీరాం డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేశారు. రామగిరి మండల వెంకటాపురం వీరి స్వగ్రామం. గతంలో ఎలాంటి పదవులు చేపట్టకపోయినా తల్లికి పార్టీ కార్యక్రమాల్లో చేదేడువాదోడుగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం రాప్తాడు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
 
జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మరో కుటుంబం జేసీ ఫ్యామిలీ. ఇందులో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన జేసీ గత ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ నుంచి గెలుపొందారు. ఆయన డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి తప్పుకుని ఆ స్థానాన్ని కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి అప్పగించారు. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడైన జేసీ పవన్ రెడ్డి వయసు 46 సంవత్సరాలు. ఎంబిఏ చదివిన పవన్ తన వ్యాపారాలు చూసుకుంటూ రాష్ట్ర ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తొలిసారి ఇప్పుడు అనంతపురం పార్లమెంట్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
 
 
మరో వారసుడు జేసీ అస్మిత్ రెడ్డి. ఊరు పెద్దపప్పురూ మండలం జూటూరు. ఎంపీ జేసీ సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన తాడిపత్రిలో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉంటూ మున్సిపాల్టీని రాష్ట్రంలోనే అగ్రగామిగా మార్చారు. ఇప్పుడు ఆయన స్థానంలో కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఉమాదేవిల కుమారుడైన జేసీ అస్మిత్ రెడ్డి వయసు 36 సంవత్సరాలు. మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన అస్మిత్ తండ్రి వ్యాపారాలు చూసుకుంటూనే తాడిపత్రి కౌన్సిలర్‌గా కూడా పని చేశారు.