గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (13:34 IST)

నరేంద్ర మోడీ చాప్టర్ క్లోజ్ : చంద్రబాబు జోస్యం

ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కథ ముగిసిపోతుందని, ఆ తర్వాత దేశానికి కొత్త ప్రధానిని తాము ఎన్నుకుంటామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. 
 
ఆయన సార్వత్రిక ఎన్నికలపై సమీక్షలను శుక్రవారం నుంచి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి రాబోయేది కొత్త ప్రధానే.. నరేంద్ర మోడీ ఇకపై ప్రధానిగా ఉండబోరన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టామన్న ఆయన.. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామని చెప్పారు. 
 
దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక గాలి వీస్తోందని, ఓటమి నైరాశ్యంతోనే నరేంద్రమోడీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్రస్టేషన్‌తోనే మోడీ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 26 ఏళ్ల క్రితం చనిపోయిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? గత ఐదేళ్లలో తానేం చేశాడో నరేంద్ర మోడీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చేసింది, చెప్పేందుకేమీ లేదు కాబట్టే మోడీ చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నప్పుడే నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైందన్నారు. నా సొంతం కోసం కాదు మోడీతో విభేదించింది.. రాష్ట్రం కోసమే బీజేపీపై తిరగబడ్డామన్నారు. ప్రత్యర్ధులపై ఈడీ, ఐటీ ద్వారా కక్షసాధింపు గతంలో లేదన్న ఏపీ సీఎం.. రూ.5 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసమే మోడీపై తిరగబడ్డామన్నారు. ప్రజాస్వామ్యం కోసమే తొలిసారి సుప్రీంకోర్టుకు వెళ్లానన్న చంద్రబాబు.. వీవీ ప్యాట్ రశీదుల కౌంటింగ్ 50 శాతం లెక్కించాలని అడిగామని.. మన పోరాటం వల్లే ఒక బూత్ కౌంటింగ్‌ను 5 బూత్‌లకు పెంచగలిగామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.