బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (07:56 IST)

గాంధీ జయంతిన 600 మంది ఖైదీలు విడుదల!

మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2న సుమారు 600 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సమన్వయంతో తుది జాబితాను తయారు చేస్తోంది కేంద్ర హోంశాఖ.

గతేడాది తీసుకొచ్చిన ప్రత్యేక క్షమాభిక్ష పథకంలో భాగంగా ఇప్పటివరకు రెండు విడతల్లో 1,424 మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ ఏడాది మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న వందల మంది ఖైదీలను విడుదల చేయనుంది ప్రభుత్వం.

ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. సుమారు 600 మంది ఖైదీలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర హోంశాఖ ఖైదీల తుది జాబితాను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంవత్సరం పాటు గాంధీ 150వ జయంతోత్సవాలను నిర్వహించాలనే నిర్ణయంలో భాగంగా ఖైదీల క్షమాభిక్ష పథకాన్ని గతేడాది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. హత్య, అత్యాచారం, అవినీతి కేసుల్లో ఉన్న ఖైదీలతో పాటు రాజకీయ నేతలను కూడా విడదల చేయకూడదని నిర్ణయించింది.

రెండు విడతల్లో 1424 మంది... గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఖైదీలకు ఉపశమనం కల్పించే ప్రత్యేక క్షమాభిక్ష పథకంలో భాగంగా ఇప్పటివరకు 1,424 మంది ఖైదీలను విడుదల చేశారు. 2018 అక్టోబర్ 2 నుంచి 2019 ఏప్రిల్ 6 వరకు రెండు విడతల్లో ఖైదీలకు విముక్తి కల్పించారు.

ఈ ఏడాది అక్టోబర్ 2న మూడో విడతలో వందల మందిని విడుదల చేసేందుకు అధికార యంత్రాంగ చర్యలు చేపట్టింది. అర్హులు ఎవరు? క్షమాభిక్ష పథకంలో భాగంగా ఇప్పటి వరకు సగం శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న 55 ఏళ్లకు పైబడిన మహిళలు, 60 ఏళ్లకు పైబడిన పురుషులు, 55 ఏళ్లకు పైబడిన ట్రాన్స్జెండర్స్, 70 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్న ఖైదీలను విడుదల చేయనున్నారు.

మరణశిక్ష, మరణశిక్ష నుంచి జీవిత ఖైదుగా మార్చిన నేరస్థులకు ప్రత్యేక ఉపశమనం కల్పించకూడదని నిర్ణయించారు.