శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 3 మే 2018 (15:00 IST)

కన్నతండ్రి కళ్లెదుటే కుమార్తెను తగలబెడుతుంటే...

కేరళలో ఓ వివాహితను కట్టుకున్న భర్తే ఆమె కన్నతండ్రి కళ్లెదుటే పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ సమయంలో చుట్టుపక్కల వారు కళ్లప్పగించి చూస్తుండిపోయారే గానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్న

కేరళలో ఓ వివాహితను కట్టుకున్న భర్తే ఆమె కన్నతండ్రి కళ్లెదుటే పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ సమయంలో చుట్టుపక్కల వారు కళ్లప్పగించి చూస్తుండిపోయారే గానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా, చెంగళూరుకు చెందిన జీతూ(29) అనే మహిళ విరాజ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిమధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టులో సాగుతోంది. అయితే, విరాజ్‌ తన భార్యపై కక్ష పెంచుకుని, ఆమెను ఏ విధంగానే హతమార్చాలన్న ధోరణితో ఉన్నాడు. 
 
ఈ క్రమంలో ఓ రుణం నిమిత్తం జీతూ తన తండ్రితో కలిసి చెంగళూరులోని కుదుంబశ్రీ కార్యాలయానికి వచ్చి, అక్కడి అధికారులతో మాట్లాడుతున్న సమయంలో భర్త విరాజ్‌ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ.. విరాజ్ వెంటపడి నిప్పంటించాడు. 
 
ఆసమయంలో అక్కడే ఉన్న జీతూ తండ్రి తన కుమార్తెను కాపాడాలని బోరున విలవిస్తూ వేడుకున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకోలేదు. ఇంతలో కాలిన గాయాలతో జీతూ కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేయాలని ప్రాధేయపడినా ఏ ఒక్కరూ కనికరించలేదు. 
 
ఈ ఘటన తర్వాత విరాజ్‌ అక్కడి నుంచి పారిపోగా.. చివరకు ఓ ఆటోడ్రైవర్‌ సాయంతో జీతూ తండ్రి ఆమె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జీతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జీతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విరాజ్‌ను బుధవారం రాత్రి ముంబైలో అరెస్టు చేశారు.