శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (16:44 IST)

హాజీ అలీ దర్గాలో ప్రవేశం కల్పించాలి : ముస్లిం మహిళా సంఘాల డిమాండ్

మొన్న శని షింగణాపూర్, నిన్న నాసిక్ త్రయంబకేశ్వరంలో, ఇప్పుడు హాజీ అలీ దర్గా.. పేర్లు ఏమైనా.. మతాలు ఏమైనా స్త్రీ వివక్ష విషయంలో మాత్రం ఒకటే అని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయా ప్రసిద్ధ దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం కోరుతూ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని శని షింగణాపూర్లోని ప్రముఖ శని దేవాలయంలోకి ప్రవేశార్హత కోరుతూ ఇటీవల మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దేవాలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేయగా దాన్ని ఆ దేవాలయ వర్గాలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ముస్లిం మహిళలు పయనిస్తున్నారు. 
 
ప్రముఖ హాజీ అలీ దర్గాలోకి తమను అనుమతించాలని, ప్రార్థనలు చేయడానికి తమకు కూడా హక్కు ఉందని వారు కూడా గొంతు కలిపారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఈ దర్గా ముంబైలో అరేబియా సముద్ర తీరాన 15వ శతాబ్దంలో నిర్మించారు. ఆ దర్గాలోని సమాధి వద్దకు పురుషులను అనుమతిస్తారు. స్త్రీలు వెళ్తే అపవిత్రమని భావించి, వారిని ఆ సమీపానికి చేరనివ్వరు. ఈ భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ నేతృత్వంలో దాదాపు 20 సంస్థలు కలిసికట్టుగా దీనికోసం ఉద్యమిస్తున్నాయి. ఈ విషయం పై తృప్తి దేశాయ్ మాట్లాడుతూ…. తాము హాజీ అలీ దర్గాలో మహిళలకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ''హాజీ అలీ సబ్‌కే లియే'' నినాదంతో ఉద్యమిస్తున్నట్లు వెల్లడించారు. 
 
దేవుడికి స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే. అందరినీ సమానంగా చూసే సృష్టికర్తకు లేనిపోని లైంగిక వివక్షను మనుషులు అంటగడుతున్నారని ఆమె వాపోయారు. ఈ నెల 28న దర్గా ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. తమ ఉద్యమాన్ని మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తున్న దేశంలోని ఇతర దేవాలయాలకు కూడా విస్తరింపజేయనున్నామన్నారు. తృప్తి దేశాయ్ ప్రకటనపై పలువురు మండిపడుతున్నారు. ఆమె ఉద్యమం షరియాకు వ్యతిరేకమంటున్నారు. అయితే, దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడంపై దాఖలైన పిటిషన్‌పై బోంబే హైకోర్టు విచారణ జరుపుతోంది.