శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (19:56 IST)

తమిళనాట పాగా కోసం బీజేపీ వెంపర్లాట: సీఎం అభ్యర్థిగా నిర్మలా సీతారామన్!?

తమిళనాట రాజకీయ నాయకత్వాలు మారనున్నాయి. తమిళనాట పాగా వేసేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. జాతీయ పార్టీలకు దక్షిణ భారతం కొరుకుడు పడని కొయ్యలా ఉండేవి. అలాంటిది తమిళనాట చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఎన్డీయే అరవ రాష్ట్రంలో ఆధిక్యం సాధించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోంది. 
 
తమిళనాట ప్రధాన పార్టీల పరిస్థితి అధ్వానంగా మారింది. డీఎంకేలో అన్నదమ్ముల మధ్య విభేదాలు పార్టీని బ్రష్టుపట్టించాయి. అన్నాడీఎంకే అధినేత్రి అవినీతి ఆరోపణలతో ఇంటికే పరిమితమైపోయింది. కాంగ్రెస్ పార్టీ చీలికలతో చిక్కిశల్యమైంది. దీంతో తమిళనాట పాగా వేసేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. 
 
తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలేవి, లేని పక్షంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం చాటేది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరమైన తప్పిదాలు దక్షిణాదిలో ఇంచుమించుగా ఆ పార్టీని తుడిచిపెట్టేశాయి. ఈ దశలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరిస్తోంది. అందులో భాగంగా వచ్చే ఎన్నికలకు తమిళనాడు సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి నిర్మళాసీతారామన్‌ను ప్రకటించనున్నట్టు సమాచారం.
 
ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర మంత్రి నిర్మళా సీతారామన్‌కు వివాదాల్లో చోటులేకపోవడం, పార్టీ అగ్రనాయకత్వానికి నమ్మదగిన వ్యక్తి కావడం అదనపు అర్హతలుగా పేర్కొనవచ్చు. ఆమెను తమిళనాట బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, సాధారణంగా దక్షిణాదిలో మహిళలంటే ఉండే గౌరవంతో పాటు, ఆమె ట్రాక్ కూడా ఆమెను గెలిపించే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఈ ఐడియా గానీ సక్సెస్ అయితే తప్పకుండా తమిళనాడు కేంద్రపాలిత రాష్ట్రంగా మారటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.