శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (12:16 IST)

బుల్లెట్ రైలు వస్తే విమానాల్లో ఎవరూ ప్రయాణించరు: నరేంద్ర మోడీ

ప్రతిదేశానికి కలులు ఉండాలని.. వాటిని సాకారం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అహ్మదాబాద్‌లో జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి భారత తొలి బులెట్ రైలు ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.

ప్రతిదేశానికి కలులు ఉండాలని.. వాటిని సాకారం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అహ్మదాబాద్‌లో జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి భారత తొలి బులెట్ రైలు ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ బుల్లెట్‌ రైలు మార్గానికి శంకుస్థాపన అనంతరం ఆయన ప్రసంగించారు. భారత్‌ చిరకాల స్వప్నం పట్టాలు ఎక్కనుందన్నారు. ఈ ప్రాజెక్టు ఉద్యోగాలను, వేగాన్ని, పర్యావరణ పరిరక్షణను, జపాన్‌ స్నేహాన్ని తీసుకువస్తుందని అన్నారు. 
 
ఇరుదేశాల మధ్య సంబంధాలకు ఇది నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని జపాన్‌ ప్రధాని అబే నిశ్చయించుకున్నారని చెప్పారు. పూర్వం నదుల వద్ద నాగరికత ఉండేదని.. తర్వాత రహదారులు ఉన్న చోట ప్రజలు నివసించారని.. ఇప్పుడు హైస్పీడ్‌ కారిడార్లు ఉన్నచోటే అభివృద్ధి ఉంటోందని ప్రధాని వివరించారు. రైల్వే లైన్లు వచ్చిన తర్వాతే అమెరికా అభివృద్ధి సాధించిందని అన్నారు.
 
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల జీడీపీ పెరుగుదలకు, మరింత మెరుగైన ఉపాధికి బులెట్ రైలు ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. ఈ రైలుకు రూ.88 వేల కోట్లను రుణంగా అందించేందుకు జపాన్ ముందుకు రావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, అందుకు షింజోకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. రైల్వే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే, ముంబై, అహ్మదాబాద్ ల మధ్య విమానాల్లో తిరిగేందుకు ఎవరూ ఇష్టపడబోరని చమత్కరించారు. 
 
ఈ ప్రాజెక్టు ఇండియాకు ఎంతో ప్రతిష్టాత్మకమని, భవిష్యత్తులో ఎన్నో నగరాల మధ్య బులెట్ రైళ్లు నడుస్తాయన్నారు. భారత వృద్ధికి హై స్పీడ్ కనెక్టివిటీ దోహదపడుతోందన్నారు. అది మొబైల్ నెట్ వర్క్ అయినా, బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ అయినా, రైల్ నెట్ వర్క్ అయినా హై స్పీడ్ కీలకమన్నారు. 
 
"సాధారణంగా భారత్‌లో బ్యాంకులు అప్పులు తీసుకుంటే 10 శాతం, 12 శాతం, 18 శాతం వడ్డీలు వసూలు చేస్తూ, ఐదేళ్లలో తీర్చాలి. పదేళ్లలో తీర్చాలి. 20 ఏళ్లలో తీర్చాలని నిబంధనలు విధిస్తుంటాయి. కానీ, జపాన్ వంటి నిజమైన మిత్రుడు మాత్రమే 88 వేల కోట్ల రూపాయలను 50 సంవత్సరాల కాల పరిమితిపై కేవలం 0.01 శాతం వడ్డీకి రుణమిస్తోందని గుర్తు చేశారు. 
 
అలాగే, కొందరు వ్యాఖ్యానిస్తున్నట్టు బులెట్ రైల్లో చార్జీలు అధికంగా ఏమీ ఉండవు. సాధారణ ప్రయాణికులు సైతం ప్రయాణించేంత తక్కువ ధరే ఉంటుందన్న భరోసాను ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే, మూడు గంటల్లోనే రెండు నగరాల మధ్యా ప్రయాణం సాకారమవుతుంది. విమానాశ్రయానికి గంట ముందు వెళ్లి, అక్కడి చెకింగ్ పూర్తి చేసుకుని, విమానం ఎక్కి, ప్రయాణం చేసి, గమ్యస్థానంలో దిగి, ఇల్లు చేరుకునే సమయంతో పోలిస్తే తక్కువ టైమ్‌లోనే రైలెక్కి కూడా వెళ్లిపోవచ్చన్నారు.