హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ బస్సు.. 18 మంది మృతి
హిమాచల్ప్రదేశ్లో హిందుస్థాన్ టిబెట్ నేషనల్ హైవేపైనుంచి ఒక బస్సు 200 మీటర్ల లోయలోకి పడి తునాతునకలైంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
దాదాపు 50 మంది ప్రయాణికులతో రెకొంగ్ పోయ్ నుంచి రాంపూర్ వెళుతున్న బస్సు.. హిందుస్థాన్- టిబెట్ జాతీయ రహదారిపైగల నాథ్పా వద్ద ప్రమాదవశాత్తు 200 మీటర్ల లోయలోకి పడిపోయింది. అంత ఎత్తునుంచి పడటంతో బస్సు ముక్కలుముక్కలుగా విరిగిపోయింది.
15 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పెద్ద శబ్ధం వినిపించడంతో ప్రమాద స్థలికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను బయటికి తీశారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.