దూకుడుకు ముకుతాడు?: 10 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలు!
పది రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చేదు ఫలితాలు లభించాయి. లోక్సభ ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ల్లో ఊహించని విజయం దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాల్లోనూ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీ వంద రోజుల పరిపాలనకు ఈ ఉప ఎన్నికలు రిఫరెండం కాకపోయినప్పటికీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలు రావడం గమనార్హం. వచ్చేనెల మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలితాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి.
గత లోక్సభ ఎన్నికల్లో యూపీలో 80 సీట్లకుగాను 71 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ మిత్రపక్షం అప్నాదళ్ మరో రెండు స్థానాల్లో గెలుపొందింది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ భారీ మెజారిటీ సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, గుజరాత్లో 9 మంది, రాజస్థాన్లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందడంతో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ, తమ స్థానాలను తిరిగి చేజిక్కించుకోవడంలో అధికార బీజేపీ విఫలమైంది.