శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (11:34 IST)

శూన్యం నుంచి బంగారు గొలుసు సృష్టించిన స్వామీజి.. తీసుకొన్న అమృత

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్వామిజీ శూన్యం నుంచి బంగారు గొలుసును సృష్టించగా, దాన్ని ఆమె తీసుకుంది. ఈ దృశ్యాలను ఓ మరాఠా టీవీ చానెల్ ప్రసారం చేయడంతో ఈ వార్త సంచలనమైంది. నిజానికి అంతరిక్షానికి ఉపగ్రహాలను పంపుతున్న ఈ రోజుల్లో మూఢనమ్మకాలకు బలం చేకూరేలా ఈ సంఘటన ఉందంటూ ఆ కథనంలో పేర్కొంది. 
 
స్వామి గురువానందస్వామి శూన్యం నుంచి బంగారు గొలుసును సృష్టించగా, దాన్ని అమృత స్వీకరించారు. ఈ దృశ్యం టీవీలో స్పష్టంగా కనిపించింది. దీనిపై మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు భగ్గమన్నాయి. క్షుద్రశక్తుల నివారణ చట్టం కింద అమృతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు. 
 
మూఢ నమ్మకాలకు ప్రోత్సాహమందించే చర్యలను ఖండించాలని, ఏకంగా సీఎం భార్యే ఇలాంటి చర్యలకు పాల్పడటం శోచనీయమని మహారాష్ట్ర ఆంధశ్రద్ధ నిర్మూలన్ సమితి అధ్యక్షుడు అవినాశ్ పాటిల్ అన్నారు.
 
దీంతో అమృత వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అద్భుతాలు, అభూతకల్పనలపై తనకు నమ్మకం లేదని, గురువానందస్వామి దీవించి ఇచ్చిన బంగారు గొలుసును తీసుకొన్నానని అమృత తెలిపారు. కేవలం స్వామి నుంచి దీవెనలు మాత్రమే అందుకొన్నానని అమృత వివరణ ఇచ్చారు.