శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (15:51 IST)

డీఎంకే-కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీ: ఆజాద్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పొత్తులపై చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీచేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. డీఎంకే ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో ముందుకు వెళ్లనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
 
డీఎంకే చీఫ్ కరుణానిధితో శనివారం ఆయన నివాసంలో భేటీ ఆయిన అనంతరం ఆజాద్ మాట్లాడుతూ.. తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తాయి. డీఎంకే సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ డీఎంకే నేతలతో మరిన్ని చర్చలు జరిగిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుందన్నారు. 
 
కాగకా చెన్నైలోని డీఎంకే అధినేత కరుణానిధి నివాసంలో దాదాపు గంటకుపైగా చర్చలు జరిపిన తరువాత పొత్తుపై ఆజాద్ మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్‌కు డీఎంకే విశ్వసనీయ మిత్రపక్షమని ఆయన పేర్కొన్నారు. కాగా 2004 నుంచి 2013 వరకు డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
 
ఆ తర్వాత కాంగ్రెస్ డీఎంకే నుంచి వైదొలగిన సంగతి విదితమే. దీంతో 2014 లోక్ సభ ఎన్నికల్లో విడిగా పోటీచేసిన కాంగ్రెస్, డీఎంకేలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి. దాంతో ఈసారి శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఎదుర్కోవాలంటే ఎక్కువ మంది మిత్రులను కూడగట్టుకోవడం డీఎంకేకు తప్పనిసరి. అందుకే సాధ్యమైనంత వరకు పొత్తుకు రెడీ అంటున్న పార్టీలను కలుపుకుని డీఎంకే ఎన్నికల బరిలో దిగనుంది.