మోడీపై కాగ్ మంటలు... పదును పెడుతున్న కాంగ్రెస్
గుజరాత్లో కాగ్ మంటలు చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పాలనను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కడిగేశారు. అభివృద్ధి నమూనా అంటూ కేంద్రంలో పగ్గాలు చేపట్టిన మోడీ-అమిత్షాల అసమర్థతను, రాష్ట్రానికి చెందిన ప్రజాసంపదను పెద్దలకు పంచిపెట్టిన వైనాన్ని కాగ్ తూర్పారబట్టింది. రిలయెన్స్ పెట్రోలియం, ఎస్సార్ పవర్, అదానీ సంస్థల ప్రయోజనాల కోసం సర్కార్ పనిచేసిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. సర్కార్ పర్యవేక్షణలోపం కారణంగా అదానీకి చెందినముంద్రాపోర్టులో 118 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయినట్టు నివేదిక చెబుతోంది.
పెరిగిపోతున్న నేరాలు
కార్పొరేట్లకు ప్రయోజనాలు కల్పించడంలో సర్కార్ చూపించిన శ్రద్దలో ఒక్కశాతం కూడా రాష్ట్రంలో పురాతన, హెరిటేజ్ భవనాలును రక్షించడంలో చూపలేదట. అరుదైన కట్టడాలను కాపాడతామని చేపట్టిన పనుల్ని మధ్యలోనే వదిలేశారు. 14 కోట్లలో నాలుగు కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన పది కోట్ల నిధులు మురిగిపోయాయి. 361 కట్టడాలు, 18 మ్యూజియాల మనుగడ ప్రమాదంలో పడింది. గుజరాత్లో నేరాలు కూడా ఎక్కువేనని కాగ్ నివేదికలో తేల్చింది.
జైళ్లలో పెరుగుతున్న ఖైదీల సంఖ్య ఇందుకు అద్దం పడుతోంది. ప్రధాన నగరాల్లో ఉన్న జైళ్లలో సామర్థ్యానికి మించి 250 నుంచి 350 శాతం మంది ఖైదీలుంటున్నారని కాగ్ నివేదికలో పేర్కొంది. జైళ్ల కోసం కొత్తభవనాల నిర్మాణంలో సర్కార్ విఫలమైంది. పైగా భద్రతా లోపాల కారణంగా పారిపోతున్నఖైదీల సంఖ్య పెరిగిపోయింది. 2013 నాటికి 1540 మంది ఖైదీలు పారిపోగా అందులో 567 మంది మాత్రమే దొరికనట్లు కూడా నివేదికలో పేర్కొంది.
ఇది నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి. విపక్షాలు విమర్శలు కాదు. స్వయంగా కాగ్ వెల్లడించిన వాస్తవాలు. అందుకేనేమో ఆమధ్య కాగ్ నివేదికలు ప్రభుత్వాలపై దాడులకు ఉపయోగపడకుండా చూడాలని సెలవిచ్చారు ప్రధాని నరేంద్ర మోడి.