శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 22 జనవరి 2017 (08:35 IST)

దీపా వెనుక ఎవరున్నారు? జల్లికట్టు వెనక శక్తులేవి: ఆరా తీస్తున్న శశికళ

జల్లికట్టు వ్యవహారంలో అన్నాడిఎంకే ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే రాజకీయశక్తుల పాత్ర ఉందా? ప్రస్తుతం అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్ శశికళ అదే అనుమానంతో ఈ గండం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని పార్టీకి, ప్

జల్లికట్టు వ్యవహారంలో అన్నాడిఎంకే ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే రాజకీయశక్తుల పాత్ర ఉందా? ప్రస్తుతం అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్ శశికళ ఇదే అనుమానంతో ఈ గండం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని పార్టీకి, ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా జయలలిత మేనకోడలు దీపా వెనుక ఎవరున్నారు. జల్లికట్టు పేరుతో సాగుతున్న ఉద్యమం వెనుక దాగిన వారి ఉద్దేశ్యాలేమిటి అనే అంశంపై శశికళ శనివారం రాత్రి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతోపాటు అన్నాడిఎంకే మంత్రులకు క్లాస్ తీసుకున్నారు.
 
చిన్నమ్మ శశికళ శనివారం ఆగమేఘాలపై పార్టీ సీనియర్లను పోయెస్‌ గార్డెన్‌కు పిలిపించారు. సీఎం పన్నీరుసెల్వంతో పాటు పది మందికి పైగా మంత్రులు పోయెస్‌ గార్డెన్‌కు పరుగులు తీశారు. పార్టీ పరంగానూ, జల్లికట్టు విషయంగానూ వీరితో చిన్నమ్మ మంతనాలు సాగాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పార్టీ పరంగా పట్టుకు చిన్నమ్మ శశికళ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
 
మరోవైపున చిన్నమ్మ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీపా వెన్నంటి నిలిచే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు దీపా పేరవై బాట పడుతుండడం, తృతీయ శ్రేణి కేడర్‌ పెద్ద సంఖ్యలో అటు వైపుగా కదులుతుండటంతో వారిని నివారించేందుకు తగ్గవ్యూహ రచనలో చిన్నమ్మ ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. 
 
అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉప్పెనలా జల్లికట్టు ఉద్యమం ఎగసి పడడంతో అత్యవసరంగా పరిస్థితిని చిన్నమ్మ సమీక్షించి ఉండడం గమనార్హం. ప్రధానంగా పార్టీ , ప్రభుత్వానికి తలవంపులు రానివ్వకుండా జాగ్రత్తలు పడాలని, జల్లికట్టు విషయంలో యువత పెద్ద ఎత్తున ఏకం, కావడం, దీని వెనుక ఉన్న శక్తుల గురించి ఆరా తీసే విధంగా చిన్నమ్మ మంతనాలు సాగి ఉండడం గమనించాల్సిన విషయం. చిన్నమ్మతో భేటీ తదుపరి శనివారం జల్లికట్టు విషయంలో పన్నీరు ప్రభుత్వం ఆగమేఘాల మీద పావుల్ని కదపడం విశేషం.
 
పార్టీలో సీనియర్లతో చర్చ అన్నట్టుగా ఈ సమావేశం సాగినా, సీఎం పన్నీరు సెల్వంతో పాటు సీనియర్‌ మంత్రులు, ఆయా జిల్లాలకు కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న  దిండుగల్‌ శ్రీనివాసన్, ఎడపాడి పళని స్వామి, తంగమణి, ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్, ఎంసీ సంపత్, కామరాజ్, కడంబూరు రాజు, ఓఎస్‌ మణి, సరోజ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి గంట పాటు చిన్నమ్మతో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకున్నట్టు చెప్పవచ్చు.