శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 24 మార్చి 2017 (02:33 IST)

స్కూలు పిల్లలు జీన్స్, స్కర్టులు వేయవద్దంటే ఒకే.. కానీ టీచర్లూ వేయవద్దంటే ఎలా చావడం?

స్కూలు పిల్లలు జీన్స్ వేయవద్దంటే ఒకే. బిగుతు దుస్తులు ధరించి రావద్దంటే ఓకే.. కానీ స్కూల్ టీచర్లు కూడా రావద్దంటే ఎలా అంటే అంతే అంటున్నారు ఆ విద్యాధికారులు.

పెద్దలను గౌరవించవలెను, అసత్యములాడరాదు, సత్యమేవజయతి, నిదానమే ప్రదానము వంటి సూక్తులను చిన్నప్పుడు బడి గోడల మీద సంవత్సరాలుగా చూసి చూసి కొన్ని పనులు చేయరాదని గట్టిగా నిర్ణయించుకున్న తరాలకు ఇప్పుడు సమాజంలో అమలవుతున్న ఆంక్షలు చూస్తే ఆశ్చర్యం వేయక తప్పదు. పిల్లలు ఇలా ఉండరాదు అనే ఆంక్షలు, ఇప్పుడు టీచర్లు కూడా ఇలా ఉండరాదు, అలా ఉండరాదు అనే ఆంక్షలు పుట్టుకొస్తున్నాయి. స్కూలు పిల్లలు జీన్స్ వేయవద్దంటే ఒకే. బిగుతు దుస్తులు ధరించి రావద్దంటే ఓకే.. కానీ స్కూల్ టీచర్లు కూడా రావద్దంటే ఎలా అంటే అంతే అంటున్నారు ఆ విద్యాధికారులు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా విద్యాధికారి టీచర్లకు అక్షరాలా ఇలాంటి ఆంక్షలే విధించేశారు. ఆయన బాధ అంతా ఒక్కటే. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు టీ షర్టులు, జీన్స్‌  ప్యాంటులు ఎందుకు వేసుకొస్తున్నారని ఆయన ప్రశ్నలు సంధించేశారు  పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, ఆహార్యంలో మరింత హుందాగా ఉండాలని వారికి బుద్ధులు చెప్పారు. టీచర్లెవరూ ఇకపై టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు ధరించి పాఠశాలకు రావొద్దని ఖరాకండిగా చెప్పేశారు.  ఉపాధ్యాయుల వస్త్రధారణ వృత్తి గౌరవం పెంచేలా ఉండాలి.. అందుకే అటువంటి దుస్తులను ధరించి పాఠశాలలకు రావొద్దు' అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. కావాలంటే దీనిపై ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానని చెప్పారు.
 
పైగా ఇంతటితో ఆగకుండా ఆయన మరిన్ని ఆంక్షలను జోడించారు. అవేంటంటే..
 
పనివేళల్లో మొబైల్‌ ఫోన్స్‌ వినియోగించ వద్దు.
పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
అన్ని పాఠశాలలో తప్పనిసరిగా ఉదయం పూట ప్రార్థన జరిగేలా చూడాలి
పాఠశాలలకు సమీపంలో పాన్‌మసాలా, సిగరెట్లు విక్రయించే దుకాణాలు కనిపిస్తే వెంటనే వాటిని మూసివేయించే విధంగా చర్యలు తీసుకోవాలి
 
ఇది ఉత్తరప్రదేశ్‌లో సంఘ్ పరివార్ ప్రభుత్వం ఉన్నందున జరుగుతున్న మార్పా లేక విద్యాధికారి మైండ్‌లో స్వంతంగా పుట్టిన నిర్ణయమా అనేది తెలీడం లేదు కానీ ఉపాధ్యాయులు పాఠశాలలకు జీన్సు ధరించి రావొద్దంటూ గతేడాది హరియాణా ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. 
 
ఒకటి మాత్రం నిజం. రెండు దశాబ్దాలకు ముందు ఎవరు ఎలాంటి వస్త్రధారణ ధరించాలి అనే చర్చలు సమాజంలో కలికానికైనా కనిపించేవి కావు. కానీ ఇప్పుడు పిల్లలు, పెద్దలు కూడా ఎలాంటి దుస్తులు ధరించాలి, కూడదు అనే ఆంక్షలు కనిపించడం ప్రగతిలో భాగమా, తిరోగతిలో భాగమా అనేది అర్థం కావడం లేదు.