శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 4 మే 2017 (10:15 IST)

కుక్క మూత్రం పోసింది. గొడవ మొదలైంది.. కాల్పుల వరకు వెళ్లింది

కుక్క మూత్రం పోయక అమృతం పోస్తుందా అని అనిపించవచ్చు కానీ అలవాటు బలంకొద్దీ అది చేసిన కొంటె పని మనుషుల ప్రాణాల మీదికి వచ్చింది. కుక్క ఎక్కడైనా మూత్రాన్ని కాస్త కాలెత్తి మరీ పోస్తుంటుంది. కానీ మన స్కూటర్ మీదికి వచ్చి పోస్తే..మండదా ఎవరికైనా.. అలాగే మండి.

కుక్క మూత్రం పోయక అమృతం పోస్తుందా అని అనిపించవచ్చు కానీ అలవాటు బలంకొద్దీ అది చేసిన కొంటె పని మనుషుల ప్రాణాల మీదికి వచ్చింది. కుక్క ఎక్కడైనా మూత్రాన్ని కాస్త కాలెత్తి మరీ పోస్తుంటుంది. కానీ మన స్కూటర్ మీదికి వచ్చి పోస్తే..మండదా ఎవరికైనా.. అలాగే మండి. ఇదేంటి మీ కుక్క నా స్కూటర్ మీదికి వచ్చి పోస్తుంది అని అమాయకంగా అడిగాడొక పెద్ద మనిషి. అంతే గొడవ మొదలైంది. అడిగినతడిని కుక్క యజమానులు కాల్చిపడేసారు. కుక్క మూత్రంపోసిన ఘటన గొడవగా మారి కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో పూరన్ లాల్ అనే వ్యక్తి బజరియా పట్టణంలోని అన్నపూర్ణాదేవి గుడికి వెళ్లాడు. అతడు తన స్కూటీని ఆలయం వెలుపల పార్కింగ్ చేశాడు. మున్నాయాదవ్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క.. అటువైపుగా వెళ్తూ ఆ స్కూటీ మీద మూత్రం పోసింది. దాంతో పూరన్ లాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ కుక్క నా స్కూటర్ మీద మూత్రం పోస్తుంటే చూస్తూ ఊరకుంటారేంటి అని అడిగాడు. 
 
అంతే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఎవరూ తగ్గలేదు. గొడవ మధ్యలో కోపం వచ్చిన మున్నా, అతడి కొడుకు కలిసి కాల్పులు మొదలుపెట్టారు. ఆ కాల్పులలో పూరన్ లాల్, అతడి కొడుకులు విజయ్ కుమార్, ముకేష్ కుమార్‌లతో పాటు రాంకిశోర్ శర్మ అనే మరో వ్యక్తి గాయపడ్డారు. వాళ్లందరినీ వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడినుంచి పరారు కావడం, పోలీసులు వారి వెంట బడటం షరా మామూలే..  
 
కుక్క మూత్రం పోయడం కూడా ఈ దేశంలో గొడవలకు, కాల్పులకు కారణం  అవుతుంటే ఇక బతకడం ఎలా?