శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 8 జులై 2017 (04:17 IST)

నీ సుఖమే నే కోరుకున్నా.. మాజీ భార్యకు పెళ్లి చేసిన మాజీ భర్త

పర పురుషుడితో మాట్లాడుతోందని అనుమానం వస్తేనే చాలు కట్టుకున్న భార్యను అమాంతంగా నరికి చంపతున్న క్రూర మగాళ్లు మొగుళ్లుగా ఉంటున్న భారత దేశంలో మాజీ భార్యకి దగ్గరుండి పెళ్లి జరిపించిన అసలైన మగాడు కర్ణాటకలో తేలాడు.

పర పురుషుడితో మాట్లాడుతోందని అనుమానం వస్తేనే చాలు కట్టుకున్న భార్యను అమాంతంగా నరికి చంపతున్న క్రూర మగాళ్లు మొగుళ్లుగా ఉంటున్న భారత దేశంలో మాజీ భార్యకి దగ్గరుండి పెళ్లి జరిపించిన అసలైన మగాడు కర్ణాటకలో తేలాడు. విడాకులు ఇచ్చేసిన తర్వాత నీ దారి నీది నాదారి నాది అని తెంచుకుపోయే సంస్కృతిలో పెరుగుతున్న సగటు భారతీయులకు భిన్నంగా నీ సుఖమే నే కోరుకున్నా, నిను వీడి అందుకే వెళుతున్నా అనే పాట చందాన ఆ భర్త తన మాజీ భార్య ప్రేమకు మద్దతు నిచ్చి ఆమె పెళ్లికి పెద్దగా నిలబడటం సంచలనం కలిగిస్తోంది. ఇద్దరూ విడాకులు తీసుకొన్నా బాధ్యత మరవని భర్తను కర్నాటక సమాజం శ్లాఘిస్తోంది.
 
భార్యాభర్తలుగా కలిసి ఉన్నప్పుడే, పరస్పరం సహకరించుకోవడం అంతంతమాత్రం. అలాంటిది విడాకులు ఇచ్చేసిన తరువాత ఎవరికి ఎవరో! అయితే, కర్ణాటకకు చెందిన ఈశ్వరగౌడ ఇలా ఆలోచించలేదు. తన మాజీ భార్యకి తానే దగ్గరుండి పెళ్లి జరిపించాడు. చిక్కబళ్లాపుర జిల్లా చింతామణికి చెందిన న్యాయవాది, రాష్ట్ర రైతు సంఘం మహిళా అధ్యక్షురాలు రచనని ఈశ్వరగౌడ 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. 
 
కానీ వేర్వేరు కారణాలతో గత ఏడాది వారు విడిపోయారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. విడాకులు తీసుకొన్న తరువాత కూడా, ఈశ్వరగౌడ ఇంట్లోనే రచన ఉంటున్నారు. ఈ క్రమంలో ఓ స్కూలు వ్యాన్‌ డ్రైవర్‌ అయిన మంజునాథ్‌తో రచనకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకొన్నారు. ఈ విషయంలో ఈశ్వరగౌడ సలహాని రచన కోరింది. చివరకు ఆయన సమక్షంలోనే దేవరగుడిలో రచన, మంజునాథ్‌ పెళ్లి చేసుకొన్నారు.
 
విడిపోయినా ఒకే ఇంట్లోనే ఎవరికి వారుగా ఉండటం,  భార్య ఆకాంక్షను గౌరవించి భర్త దగ్గరుండి మరీ పెళ్లి జరిపించడం అన్నీ అమెరికన్ జీవన సంస్కృతిని తలపిస్తున్నా, ఇది కచ్చితంగా మన భారతదేశంలోనే మన పొరుగునే జరగడం విశేషం.