శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (14:22 IST)

జయను కాపాడలేని శశికళ పార్టీని ఏం కాపాడుతుంది: దీపన్ ప్రశ్న.. ఈయన ఎవరో తెలుసా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇంకా పలు అనుమానాలున్న సంగతి తెలిసిందే. అపోలోలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన జయలలితకు తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమె నెచ్చెలి శ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇంకా పలు అనుమానాలున్న సంగతి తెలిసిందే. అపోలోలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన జయలలితకు తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమె నెచ్చెలి శశికళ బాధ్యతలు వహించిన సంగతి తెలిసిందే. అయితే శశికళ చిన్నమ్మగా పార్టీ పగ్గాలను స్వీకరించడంపై పలు చోట్ల అభ్యంతరాలు, నిరసనలు వెల్లువెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో జయలలితను కాపాడలేని వారు.. పార్టీని ఎలా కాపాడుతారని జానకీ ఎంజీఆర్ (దివంగత సీఎం ఎంజీఆర్ భార్య) తమ్ముడు కుమారుడు దీపన్ ప్రశ్నించారు. ఎంజీఆర్ అంత్యక్రియల సమయంలో మిలటరీ వాహనం నుంచి జయలలితను అవమానించి కిందకి నెట్టిన దీపన్.. తాజాగా జయలలిత మరణానికి తర్వాత ఓ తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టడంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలోనే ఆమె పట్ల నిరసన వ్యక్తం చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ పార్టీ కోసం అన్నాడీఎంకే కార్యకర్తలు మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
 
తన స్వార్థం కోసం జయలలితను ఉపయోగించుకున్న శశికళ.. ఆమె ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే పార్టీని చిన్నమ్మ ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం శశికళ 75 రోజుల పాటు జయలలిత ఎవరి కంట పడనీయకుండా చేశారని దీపన్ ఆరోపించారు. అందరినీ బెదిరించి.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారని దుయ్యబట్టారు. శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టడం దురదృష్టకరమని, ఆమె బెదిరింపులకు పాల్పడ్డారనేందుకు నటుడు ఆనంద్ రాజ్ వంటి నేతలే నిదర్శనమన్నారు. శశికళ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగానే విలన్‌గా సినిమాల్లో నటించే ఆనంద్ రాజ్ పార్టీ నుంచి తొలగిపోయారని దీపన్ గుర్తు చేశారు. 
 
అయితే పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోగానే శశికళ వర్గీయులు ఆయన్ని బెదిరించారని దీపన్ వెల్లడించారు. శశికళపై అసంతృప్తి త్వరలోనే బయటపడుతుందని దీపన్ వ్యాఖ్యానించారు. శశికళ పేరాశ ఎక్కువని ఆమెను అన్నాడీఎంకే అధినేత్రిగా స్వీకరించేందుకు తమిళ ప్రజలతో పాటు మహిళలు ఒప్పుకోవట్లేదని తెలిపారు.