బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (14:44 IST)

సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్ : ఢిల్లీలో బాణాసంచా లేని దీపావళి

దీపావళి సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా దేశరాజధానిలో టపాసుల అమ్మకంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

దీపావళి సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా దేశరాజధానిలో టపాసుల అమ్మకంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. దేశరాజధాని పరిధిలో హోల్‌సేల్‌గా గానీ, రిటైల్‌గా గానీ టపాసులు అమ్మకుండా లైసెన్స్‌లపై నిషేధం విధిస్తూ గతేడాది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని వచ్చే నవంబరు ఒకటో తేదీ వరకు పొడగించింది. 
 
గత సంవత్సరం నవంబరులో ముగ్గురు చిన్నారులు కోర్టుకు లేఖ రాస్తూ, క్రాకర్స్ అమ్మకాలను నిషేధించాలని కోరిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పటాసుల అమ్మకాలపై నిషేధం విధించి, ఆపై వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజల విన్నపం మేరకు దాన్ని సవరించింది. తిరిగి ఈ దీపావళికి టపాకాయల విక్రయాలు సాగరాదని తాజాగా ఆదేశించింది. 
 
ప్రతి యేడాది దీపావళి రోజున కాల్చే టపాకాయల కారణంగా వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ఎయిర్ క్వాలిటీలో వచ్చే తేడాను సరిగ్గా అంచనా వేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. గత సంవత్సరం కూడా దీపావళి మరుసాడు దట్టమైన పొగ, దుమ్ము, ధూళితో నగరం నిండిపోయిందని ధర్మాసనం గుర్తుచేసింది. 
 
కాగా, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సెంట్రల్ పొల్యూషన్ బాడీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు సమర్థించాయి. దీంతో ఈనెల 19వ తేదీన దేశ వ్యాప్తంగా ప్రజలు బాణాసంచా కాల్చుతూ దీపావళి జరుపుకుంటే... ఢిల్లీ వాసులు మాత్రం టపాకాయలు పేల్చకుండా దీపావళి జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.