శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (14:14 IST)

గాలి మెడకు మరో ఉచ్చు.. రూ.100 కోట్ల పాత నోట్ల మార్పిడి... డ్రైవర్ సూసైడ్‌ లేఖతో బహిర్గతం

అక్రమ మైనింగ్ కేసులో చిక్కుకుని రెండేళ్ళకు పైగా జైలు జీవితం గడిపిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో పెద్ద నోట్ల చెలామణిపై నిషేధం విధించి

అక్రమ మైనింగ్ కేసులో చిక్కుకుని రెండేళ్ళకు పైగా జైలు జీవితం గడిపిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో పెద్ద నోట్ల చెలామణిపై నిషేధం విధించిన తర్వాత ఆయన కొందరు మధ్యవర్తుల సాయంతో రూ.100 కోట్ల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చారు. ఈ విషయం రెవెన్యూ అధికారి కారు డ్రైవర్ ఆత్మహత్య లేఖలో బహిర్గతమైంది. 
 
నిజానికి.. ఇటీవల దేశం అబ్బురపోయేలా గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మణికి అంగరంగ వైభంగా వివాహం జరిపించాడు. నోట్ల రద్దు తర్వాత కూడా గాలి జనార్ధన్‌రెడ్డి అన్ని కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెళ్లి ఎలా చేయగలిగాడనే ప్రశ్న అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికేలోపే గాలి జనార్దన్‌రెడ్డి మెడకు తాజాగా మరో ఉచ్చు బిగిసింది. 
 
గాలి జనార్ధన్ రెడ్డి మధ్యవర్తుల సాయంతో పాతనోట్లు మారుస్తున్నట్లు తెలిసింది. నోట్ల మార్పిడి సమయంలో కొంత నగదు తక్కువగా వచ్చిందని ఈ నోట్ల మార్పిడికి సహకరించిన రెవెన్యూ అధికారి డ్రైవర్‌కు గాలి అనుచరుల నుంచి బెదిరింపులొచ్చాయి. దీంతో మనస్తాపంతో డ్రైవర్‌ రమేష్‌గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రమేష్ గౌడ రాసిన సూసైడ్‌నోట్‌తో గాలి బాగోతం వెలుగులోకి వచ్చింది. బళ్లారిలో 20 శాతం కమీషన్‌తో 100 కోట్ల పాతనోట్లు మార్పిడి చేసినట్లు ఈ లేఖ ద్వారా తెలిసింది. ఈ నోట్ల మార్పిడిపై ఈడీ, ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.