శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (13:14 IST)

బీజేపీకి షాకిచ్చిన టీడీపీ ఎంపీలు ... 'ట్రిపుల్ తలాక్' బిల్లుకు చుక్కెదురు

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చింది.

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చింది. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదించడానికి వీల్లేదంటూ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు తేల్చి చెప్పారు. అలాగే, అన్నాడీఎంకే ఎంపీలు కూడా అడ్డు చెప్పారు. దీనికితోడు ఎగువ సభలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లు ఆమోదానికి మోకాలొడ్డింది. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లు పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలనకు వెళ్లనుంది. 
 
ప్రస్తుతం ఎవరైనా ముస్లిం వ్యక్తి, తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇస్తే, అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించాలని చట్టంలో ఉన్న నిబంధనను కాంగ్రెస్ తదితర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ, బీజేపీ ఎంపీలు మాత్రం ఇలాంటి కఠిన నిబంధన ఉండాలని అపుడే ఈ తరహా నేరానికి పాల్పడబోరని వాదిస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో తనకున్న ప్రజాప్రతినిధుల బలంతో లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదింపజేసుకున్నారు. కానీ, రాజ్యసభలో మాత్రం చుక్కెదురైంది. రాజ్యసభలో విపక్షాల బలం ఎక్కువగా ఉండటంతో, వారు కోరినట్టుగానే ఈ బిల్లును పార్లమెంట్ కమిటీ (సెలెక్ట్ కమిటీ)కి పంపించాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో పార్లమెంట్ తదుపరి సెషన్ వరకూ ఈ బిల్లును అటకెక్కించినట్టేనని భావించవచ్చు. 
 
తదుపరి పార్లమెంట్ సమావేశాలంటే, బడ్జెట్‌పై సాగుతాయన్న సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లో ఇటువంటి దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులను తెరపైకి తెచ్చే అవకాశాలు లేకపోవడంతో, జూన్ లేదా జూలైలో జరిగే వేసవికాల సమావేశాల వరకూ బిల్లు పార్లమెంటరీ కమిటీ టేబుల్‌పైనే ఉండనుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.