మత విద్వేషాలను రెచ్చగొట్టే 40 వెబ్సైట్లు నిషేధం..
దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో అభిప్రాయాలను వెల్లడిచేస్తూ, వార్తలను ప్రచురిస్తున్న 40 వెబ్సైట్లను సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2009 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇటీవల కాలంలో తీవ్రవాద సంస్థలు ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో ఫోటోలను, వీడియోలను వెబ్సైట్లలో పెడుతున్నాయి. మతవాదాన్ని, తీవ్రవాదాన్ని విస్తరింపచేసేందుకు వెబ్సైట్లను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు దేశ శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని ఇటువంటి చర్యలు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో అభిప్రాయాలు నమోదు చేయడం, ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం జూన్ నెల 29వ తేది ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు సూచించిన 40 వెబ్సైట్లలో ఇప్పటికే అనేక వెబ్సైట్లను నిషేధించారు. ఇంకా సాంకేతిక పరమైన కారణాల వలన కొన్ని వెబ్సైట్లు పని చేస్తూ వచ్చాయి. అయితే త్వరలోనే వాటిని కూడా నిషేధిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.