శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (12:42 IST)

చెన్నైకు రానున్న గవర్నర్.. తొలి పిలుపు పన్నీర్‌కే... ఎందుకంటే...

తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైకు రానున్నారు. ఆయన ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళతారు. అక్కడ తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ర

తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైకు రానున్నారు. ఆయన ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళతారు. అక్కడ తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ రాజేంద్రన్‌లతో పాటు... మరికొంతమంది ఉన్నతాధికారులను పిలిచి రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటారు. 
 
ఆ తర్వాత తనను కలిసే వారికి అపాయింట్మెంట్లు ఇస్తారు. ఇలాంటివారిలో తొలుత తనను కలిసే మొదటి అవకాశాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ.పన్నీర్ సెల్వంకు ఇవ్వచ్చని రాజ్‌భవన్ వర్గాలు సంకేతాలిచ్చాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తొలి అవకాశం ఆయనదేనని, అయితే, అంతకుముందు డీజీపీ, సీఎస్ తదితరులతో గవర్నర్ సమావేశమవుతారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 
 
గవర్నర్‌ను కలిసిన తర్వాత, తాను మద్దతు నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరితే, గవర్నర్ అందుకు అంగీకరించి, అసెంబ్లీ ఏర్పాటుకు సూచించాల్సి ఉంటుంది. అప్పుడిక శశికళ వర్గం, అసెంబ్లీకి రావాలో, వద్దో నిర్ణయించుకోవాల్సి వుంటుంది. రాకుంటే, డీఎంకే మద్దతుతో పన్నీర్ సీఎంగా నిలుస్తారు. వచ్చి వ్యతిరేకంగా ఓటేస్తే, పన్నీర్ వెంట 30 మంది ఎమ్మెల్యేలున్నా అదే డీఎంకే మద్దతుతో ప్రభుత్వం నిలుస్తుంది. ఏదిఏమైనా పన్నీర్.. విన్నర్ కావాలంటే డీఎంకే లీడర్ ఎంకే. స్టాలిన్ అండగా నిలబడాల్సి ఉంది.