శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (18:14 IST)

పాక్‌లో హిందూ వైద్యుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు!

పాకిస్తాన్‌లో నివసించే హిందువులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. గతంలో నమ్రత అనే హిందూ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపి హత్య చేశారు. ఇపుడు ఓ హిందూ వైద్యుడిని కత్తులతో పొడిచి చంపేశారు. ఈ దారుణం సింధ్ ప్రావిన్స్‌లోని తాండో అల్లిహార్ ప్రాంతంలో జరిగింది. మృతుడు లాల్ చంద్ బాగ్రీ అనే హిందు వైద్యుడిగా గుర్తించారు. 
 
ఈయన గత కొన్నేళ్లుగా తన నివాసంలోనే వైద్య క్లినిక్‌ను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆయన తన నివాసంలో ఉండగా, దుండగులు దారుణంగా చంపేశారు. కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి, పరారయ్యారు. తీవ్రగాయాలతో డాక్టర్ లాల్ చంద్ ప్రాణాలు విడిచారు.
 
ఈ ఘటనపై పొరుగింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నది తెలియరాలేదు. డాక్టర్ లాల్ చంద్ హత్య దర్యాప్తులో భాగంగా ఆయన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.
 
కాగా, గతేడాది నమ్రతా చందాని అనే జూనియర్ డాక్టర్ కూడా కరాచీ సమీపంలో హత్యకు గురైన విషయం తెల్సిందే. లార్కనాలో ఆమె బీబీ ఆసిఫా మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. నమ్రత సోదరుడు కరాచీలో శస్త్రచికిత్సల నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నమ్రత ఉమెన్స్ హాస్టల్‌లో ఉండగా ఆమెపై అత్యాచారం చేసిన దుండగులు, ఆపై హత్యచేశారు.