మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (06:50 IST)

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’.. అమిత్ షా తొత్తులు: వైశ్య నేతలపై ఐలయ్య

ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులపై వివాదాస్పద రచయిత, మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య మరోమారు మాటలతో దాడి చేశారు. తన ఇంటికి వచ్చి గొడవ చేయాలని చూస్తున్న వైశ్య సంఘాల ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొత్

ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులపై వివాదాస్పద రచయిత, మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య మరోమారు మాటలతో దాడి చేశారు. తన ఇంటికి వచ్చి గొడవ చేయాలని చూస్తున్న వైశ్య సంఘాల ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొత్తులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... అమిత్ షానే తన ఇంటిపైకి వైశ్యులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. తన ఇంటికి రావడానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఎవరని ప్రశ్నించారు. ఆయన వస్తే సమాధానం చెప్పడానికి తన జాతి సిద్ధంగా ఉందని, ధైర్యముంటే రావాలని సవాల్ విసిరారు.
 
అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చి తనను చర్చకు ఆహ్వానిస్తే వస్తానని, వైశ్యులు జాతికి చేసిన ద్రోహంపై మాట్లాడతానని అన్నారు. చదువురాని వారితో తాను చర్చకు వెళ్లే ప్రసక్తే లేదని, చేతనైతే అమిత్ షా వచ్చి తనతో బహిరంగ చర్చకు కూర్చోవాలని, ఇలా ఇళ్లపైకి తన మనుషులను పంపిస్తుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు. 
 
ఆర్యవైశ్యులు తనపై యుద్ధం ప్రకటించారన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ తనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, తాను రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకంలో అన్నీ వాస్తవాలే ఉన్నాయని మరోమారు స్పష్టం చేశారు. మార్కెట్లలో 80 శాతం కొనుగోలుదారులు వైశ్యులే ఉంటారని, వడ్డీ వ్యాపారం చేసే వారిలోనూ వైశ్యులే ముందంజలో ఉంటారని, సామాన్యుల నుంచి ముక్కు పిండి మరి వడ్డీ వసూలు చేస్తారని ఆరోపించారు. 
 
గత నెల రోజులుగా మీడియా ముఖంగా, వ్యక్తిగతంగా ఫోన్ లో బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనపై జరుగుతున్న దాడుల వెనుక బీజేపీ,అమిత్ షా హస్తం ఉందని ఆరోపించారు. అంబానీ, అమిత్ షాలు బనీయాలని ప్రకటించుకున్నారని, డీమోనిటైజేషన్ దేశంలోనే అతిపెద్ద సోషల్ స్మగ్లింగ్ అని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు జాతీయవాదులని కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు.