ఇంద్రాణికి తప్పిన ప్రాణాపాయం.. స్టేట్మెంట్ను రికార్డు చేయనున్న సీబీఐ
దేశంలో సంచలనం సృష్టించిన షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా అభియోగాలు ఎదుర్కొంటున్న స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా సతీమణి ఇంద్రాణి ముఖర్జియాకు ప్రాణగండం తప్పింది. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చింది. దీంతో ఆమె వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సీబీఐ భావిస్తోంది.
కన్న కుమార్తె షీనా బోరా హత్య కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న ఇంద్రాణి శుక్రవారం మోతాదుకు మించి మాత్రలు తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయంతెల్సిందే. ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలింది. దీంతో వెంటిలేటర్ ద్వారా ఆమెకు ఆక్సిజన్ అందించారు.
ఆ తర్వాత ఆమెను ముంబైలోని జేజే ఆస్పత్రికి తరిలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. చికిత్సకు ఆమె శరీరం స్పందిస్తోందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి డీన్ లహానె హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇంద్రాణికి ప్రాణాపాయం తప్పిందని, అయితే ఇంకా అమెను 24 గంటలపాటు పరిశీలనలోనే ఉంచామని తెలిపారు. ఇంద్రాణి స్పృహలోకి కి వచ్చిందనీ.. త్వరలోనే సాధాణ స్థితికి చేరుకుంటుందని వైద్యులు ధృవీకరించారు.
మరోవైపు ఇంద్రాణి అనారోగ్యానికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కు, జేజే హాస్పటల్ డీన్ ఇచ్చిన నివేదిక పొంతన లేకుండా ఉండటం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. ఓవర్ డోస్ వల్లే ఇంద్రాణి అస్వస్థతకు గురైందని డీన్ చెప్పిన దానికి భిన్నంగా అలాంటిదేమీలేదని ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అయితే, చివరకు మాటమార్చిన డీన్ ఓవర్డోస్ కారణం కాదని చెప్పడం విశేషం.
మొత్తంమీద ఈ ఎపిసోడ్లో అనేక ప్రశ్నలకు జవాబులు లభించాల్సి ఉంది. ఆమెది ఆత్మహత్యా ప్రయత్నమేనా లేక మరో కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ల మాటలకు, ఫోరెన్సిక్ నివేదికకు పొంతన కుదరక పోవడం మరో విశేషం.