శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (17:10 IST)

ఆర్కే నగర్‌లో దీప ఒంటరి పోరు వద్దే వద్దు.. ఓపీఎస్‌తో కలిస్తేనే ముద్దు.. అప్పుడే చిన్నమ్మకు పిడిగుద్దు..!

తమిళనాడు సీఎం జయలలిత మేనకోడలు దీపాకు ప్రస్తుతం కష్టాలు తప్పేలా లేవు. మాజీ సీఎం పన్నీరును పక్కన బెట్టి ఒంటరిగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమ్మడు సిద్ధమైపోయింది. అయితే ఇది చిన్నమ్మ శశికళకు

తమిళనాడు సీఎం జయలలిత మేనకోడలు దీపాకు ప్రస్తుతం కష్టాలు తప్పేలా లేవు. మాజీ సీఎం పన్నీరును పక్కన బెట్టి ఒంటరిగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమ్మడు సిద్ధమైపోయింది. అయితే ఇది చిన్నమ్మ శశికళకు అనుకూలం అవుతుందని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. అంతేగాకుండా ఓపీఎస్‌తో కలిసి పనిచేస్తేనే దీపకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారు సూచిస్తున్నారు. 
 
ఇప్పటికే ఆర్కే నగర్‌లో అన్నాడీఎంకే పార్టీకి తిరుగేలేదు. అలాంటి నియోజకవర్గంలో పన్నీరు లేకుండా దీప నిలబడితే ఫలితాలు తారుమారు అవుతాయని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. ఇంకా అధికారంలో ఉన్న శశికళ వర్గీయులు, ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వ పెద్దలు ఎత్తులు పై ఎత్తులు వేసి అన్నాడీఎంకే ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.
 
పన్నీర్ సెల్వం మద్దతు తీసుకుంటే దీపా ఆర్ కే నగర్ నుంచి గెలిచే అవకాశం ఉందని, లేకుంటే మాత్రం చిన్నమ్మ రాజకీయ పన్నాగానికి దీప బలి కావాల్సి వస్తుందని వారు సూచిస్తున్నారు. చిన్నమ్మపై తిరుగుబాటు ఎగురవేసినా ఓపీఎస్‌ను పక్కనబెట్టి.. పళనిస్వామిని సీఎంగా చేసి జైలులో కూర్చున్న చిన్నమ్మ రాజకీయ కుతంత్రానికి ఆర్కే నగర్‌లో దీప ఒంటరిగా పోటీ చేస్తే బలికాకతప్పదు.
 
ఈ స్థానంలో ఓట్లు చీలిపోతే.. కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగుతున్న డీఎంకే పార్టీకి విజయం ఖరారైపోతుందని.. అందుకే దీపా, పన్నీర్ సెల్వం వర్గీలు కలిసి శశికళకు చెక్ పెట్టాలని స్థానిక అన్నాడీఎంకే నాయకులు, అక్కడి కార్యాకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో దీప-పన్నీర్ సెల్వం పార్టీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తారో లేక చిన్నమ్మకు పరోక్షంగా అవకాశం ఇస్తారో అనేది వేచి చూడాలి.