శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (13:17 IST)

వెలవెలబోయిన పోయెస్ గార్డెన్.. అమ్మను శశికళ కలవనివ్వలేదు.. జయ చిన్ననాటి స్నేహితులు

తమిళ రాజకీయాల్లో జయలలిత శకం ముగిసేదాకా పోయెస్ గార్డెన్‌లో కార్యాచరణ అంతా ఇక్కడి నుంచే ప్రారంభమయ్యేది. వచ్చిపోయే నేతలు, పార్టీ సమాలోచనలు, కీలక నిర్ణయాలు.. ఇలా తమిళనాడువ్యాప్తంగా పోయెస్ గార్డెన్ అందరి న

తమిళ రాజకీయాల్లో జయలలిత శకం ముగిసేదాకా పోయెస్ గార్డెన్‌లో కార్యాచరణ అంతా ఇక్కడి నుంచే ప్రారంభమయ్యేది. వచ్చిపోయే నేతలు, పార్టీ సమాలోచనలు, కీలక నిర్ణయాలు.. ఇలా తమిళనాడువ్యాప్తంగా పోయెస్ గార్డెన్ అందరి నోళ్లల్లోను నానిపోయింది. అదే సమయంలో మన్నార్ గుడి మాఫియా ఎంట్రీతో కొన్ని వివాదాలకూ కేంద్రమైంది. 
 
జయలలిత మరణానంతరం అదే ఇంట్లో పాగా వేసిన శశికళ ప్రస్తుతం అక్కడినుంచే అన్నాడీఎంకె రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతుండటం శశికళను కలవరానికి గురిచేస్తోంది. అదే సమయంలో పన్నీర్ ఇంటికి పోటెత్తిన కార్యకర్తలతో ఆయన ఇల్లు కళకళలాడుతుండగా..శశికళ నివాసముంటున్న పోయెస్ గార్డెన్ మాత్రం వచ్చిపోయెవారు లేక బోసిపోతోంది. 
 
ఇదిలా ఉంటే.. శశికళకు ఎమ్మెల్యేల బలం తగ్గిపోతోంది. ఎమ్మెల్యేలే కాకుండా జయలలితకు చిన్ననాటి స్నేహితులు కూడా పన్నీర్ సెల్వంకే మద్దతు ప్రకటించారు. జయ నుంచి తమను శశికళ దూరం చేసిందని చాందిని పంకజ్ బులానీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను డెలివరీ అయినప్పుడు హాస్పిటల్‌కు వచ్చి జయ పరామర్శించారని... ఆ తర్వాత జయను కలిసే అవకాశాన్ని కూడా శశికళ ఇవ్వలేదని పంకజ్ బులానీ మండిపడ్డారు. 
 
జయను కలిసేందుకు ఒకసారి పన్నీర్ సెల్వం అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. కానీ, శశికళ మనుషులు తనను అడ్డుకున్నారని చెప్పారు. పన్నీర్ సెల్వం మాత్రం చాలా గొప్ప వ్యక్తి అని... చివరిసారి తాము జయతో కలసి భోజనం చేసినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారన్నారు. పన్నీర్ సెల్వం వంటి వారిని తన రాజకీయ వారసుడిగా జయ ప్రకటించి ఉంటే బాగుండేదని అమ్మ స్నేహితురాలు శ్రీమతి అయ్యంగార్ తెలిపారు.