శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 మే 2016 (11:44 IST)

శాంతిభద్రతలు దేవుడికి అప్పగించి.. పోలీసులంతా సామూహిక సెలవులు

శాంతిభద్రతలు దేవుడి చేతుల్లో పెట్టి పోలీసులంతా సామూహిక సెలవుల్లో వెళ్లిపోనున్నారు. ఈ పరిస్థితి కర్ణాటక రాష్ట్రంలో రానుంది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఆ రాష్ట్ర పోలీసులంతా సామూహిక సెలవులు పెట్టనున్నారు. ఖాకీలంతా ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. సీనియర్ అధికారుల వేధింపులు, విపరీత పనిఒత్తిడి, కుటుంబంతో కలిసి ఉండే సమయం సైతం చిక్కకపోవడం, తక్కువ జీతాలు, అత్యవసర సమయాల్లో సైతం లభించని సెలవు వంటి తదితర కారణాలతో వీరు నిరసన తెలిపే చర్యల్లో భాగంగా ఈ సెలవులు పెట్టనున్నారు. 
 
కానిస్టేబుళ్ల ఉద్యమాన్ని అఖిల కర్ణాటక పోలీస్ మహాసంఘ్ ముందుండి నడిపిస్తుంది. కానిస్టేబుళ్ల వెతలపై కర్ణాటక పోలీస్ మహాసంఘ్ అధ్యక్షుడు శశిధర్ స్పందిస్తూ.. రాష్ట్రంలో దాదాపు 85 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వీరిలో 65 వేల మంది కానిస్టేబుళ్లు. వీరంతా 15 గంటలకు పైగా ప్రతి రోజూ విధులు నిర్వహిస్తున్నారు. ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. గడిచిన 25 ఏళ్లుగా పోలీసులు తమ బాధలపై విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. న్యాయస్థానాలు సైతం వీరికి బాసటగా నిలువలేదు. అందుకే వీరంతా కలిసికట్టుగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
 
మరోవైపు... కానిస్టేబుళ్ల సాముహిక సెలవును డీజీ ఓం ప్రకాశ్ తిరస్కరించారు. విధులకు హాజరుకాకుంటే వారిని ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తీసివేయడంగానీ లేదా పూర్తిగా తొలగించడగానీ చేయాలని స్టేషన్ హౌజ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. డీజీ తీరుపై నిరసన తెలియజేస్తూ శశిధర్ ఓ లేఖను రాశారు. కొరియర్ ద్వారా లేఖతో పాటు పూలు, చీరను పంపారు. ఇలాంటి బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.