శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 మార్చి 2018 (15:22 IST)

దాణా స్కామ్ : నాలుగో కేసులో కూడా లాలూ దోషి : సీబీఐ కోర్టు

బీహార్ రాష్ట్రాన్నే కాకుండా, దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన దాణా స్కామ్‌లోని పలు కేసుల తుది తీర్పులు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే వెల్లడైన మూడు తీర్పుల్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అ

బీహార్ రాష్ట్రాన్నే కాకుండా, దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన దాణా స్కామ్‌లోని పలు కేసుల తుది తీర్పులు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే వెల్లడైన మూడు తీర్పుల్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఈ నేపథ్యంలో సోమవారం వెల్లడైన నాలుగో కేసులోనూ ఆయన్ను సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించింది. ఈ మేరకు రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో మరో 30 మంది ప్రమేయం కూడా ఉన్నట్టు తేల్చింది.
 
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1995 డిసెంబర్ నుంచి 1996 జనవరి మధ్య దుంబా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా విత్ డ్రా చేసి, ఈ దాణా స్కామ్‌కు పాల్పడినట్టు తేలింది. దీంతో లాలూను దోషిగా నిర్ధారించింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు ఊరట లభించింది. ఆయనతో పాటు మరో 14 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.
 
ఇదిలావుండే, రాంచీలోని బిర్శా ముండా జైల్లో ఉన్న లాలూప్రసాద్ శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కోర్టుకు హాజరుకాకపోయినప్పటికీ.. కోర్టు మాత్రం తుది తీర్పును వెలువరించింది.